ఉక్కు ప్రైవేటు బాట
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:57 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన సంగతి తెలిసిందే.
మూడు విభాగాల్లో కన్వేయర్ బెల్ట్ల నిర్వహణ బాధ్యతలు కాంట్రాక్టుకు ఇచ్చేందుకు నిర్ణయం
రూ.19.1 కోట్లకు టెండర్ల ఆహ్వానం
కాంట్రాక్టు కార్మికుల స్థానంలో సంస్థలతో పనులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన సంగతి తెలిసిందే. ప్లాంటులో కీలకమైన పనులు చేసే కాంట్రాక్టు కార్మికులు తగ్గిపోతే నిర్వహణ పనులు ఎలాగని అధికారులే ప్రశ్నిస్తున్నారు. వారి సంఖ్య తగ్గించడం వల్లే కొన్ని విభాగాల్లో నిర్వహణ పనులు ఆగిపోయి, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల జరిగిన ఘటనలను ఉదహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు (మెకానికల్, ఎలక్ట్రికల్, కన్వేయర్ బెల్ట్ల నిర్వహణతో పాటు హౌస్ కీపింగ్ బాధ్యతలు) విభాగాల్లో పనులను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టుపై ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి టెండర్లను కూడా ఆహ్వానించింది. ఐరన్ఓర్ను సరఫరా చేసే కన్వేయర్లు, బాయిలర్ కోల్, ఇతర ముడి పదార్థాలను అందించే కన్వేయర్లు, అక్కడి పరికరాల నిర్వహణ పనులు చేపట్టడానికి అర్హులైన వారు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. మెకానికల్, ఎలక్ర్టికల్ నిర్వహణ పనుల కోసం 31 కన్వేయర్లు, మరో విభాగంలో హౌస్ కీపింగ్, నాలుగు యార్డులు, 26 కన్వేయర్ల నిర్వహణకు ఇంకో కాంట్రాక్ట్, బొగ్గు సరఫరాకు సంబంధించి 18 కన్వేయర్లు, పరికరాలతో కూడిన తొమ్మిది ప్లాంట్లను నెలవారీ నిర్వహణకు ఇస్తామని ప్రకటించింది. సరఫరాకు అంతరాయం లేకుండా, ప్రమాదాలు జరగకుండా, ఉత్పత్తికి విఘాతం లేకుండా ఆయా విభాగాలను నిర్వహించాలని (టోటల్ మెయింటెనెన్స్) సూచించింది. మొదటి విభాగంలో రూ.7.15 కోట్లు, రెండో విభాగంలో రూ.6.41 కోట్లు, మూడో విభాగంలో రూ.5.58 కోట్లు కలిపి మొత్తం రూ.19.1 కోట్లకు కాంట్రాక్టు ఇస్తామని, ఈ నెల మొదటి వారంలోగా బిడ్లు సమర్పించాలని పేర్కొంది. వీటి ద్వారా వచ్చే ఫలితాలను చూసి మిగిలిన విభాగాల్లోను సిబ్బందిని తగ్గించి, వాటిని కూడా ప్రైవేటుకు ఇవ్వాలని భావిస్తోంది.
ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ
జిల్లాలో సుమారు 9,11,000 మంది లబ్ధిదారులు
ఇప్పటివరకూ 6,58,000 మంది ఈకేవైసీ పూర్తి
మిగిలిన వారి ఇళ్లకు వెళ్లి ప్రక్రియను చేపడుతున్న ఏఎన్ఎంలు
రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డుదారుల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి ఏఎన్ఎంకు వారి పరిధిలోని ఆయుష్మాన్ భారత్ కార్డుదారుల జాబితాను అందించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయు ష్మాన్ భారత్కు జిల్లాలో సుమారు 9,11,000 మంది లబ్ధిదారులుగా ఎంపిక కాగా, ఇప్పటి వరకూ 6,58,000 మంది ఈకేవైసీ పూర్త య్యింది. ఏఎన్ఎంలు ప్రతిరోజూ పది మంది లబ్ధిదారులను కలిసి ఈకేవైసీ చేయా లని అధికారులు ఆదేశించారు. రెండు నెలల్లో ఈకేవైసీ పూర్తిచేయాలని భావిస్తున్నారు.
ఉచిత వైద్య సేవలు
ఆయుష్మాన్ భారత్ కార్డుదారులు గరి ష్ఠంగా ఐదు లక్షల రూపాయల వరకూ వైద్య సేవలు ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంది. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ పరిధిలో గల అన్ని ఆస్పత్రుల్లోనూ ఆయు ష్మాన్ హెల్త్ కార్డు ద్వారా సేవలను పొంద వచ్చు. వైద్య సేవలు అందించినందుకు గాను ఆయా ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంతోపాటు పక్క రాష్ట్రమైన తెలంగాణలోని కొన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేందుకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఉపయోగపడుతోంది. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.
ఇకపోతే, జిల్లాలో ఇప్పటివరకూ ఈకేవైసీ పూర్తయిన లబ్ధిదారులకు సంబంధించిన కార్డులు కొన్నాళ్ల కిందట ఆరోగ్య శాఖ కార్యా లయానికి వచ్చాయి. వాటిని అధికారులు ఇప్ప టికే పంపిణీ చేశారు. ఇకపై ఈకేవైసీ చేయించుకునే లబ్ధిదారులు నేరుగా ఆన్లైన్లో కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల జాబితా ఇప్పటికే సచి వాలయాలకు అందించామని, ఆ జాబితాలోని లబ్ధిదారులు స్థానిక ఏఎన్ఎం ద్వారా ఈకేవైసీ పూర్తిచేయించుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు సూచించారు.
మెడ్టెక్ జోన్కు రూ.8.5 కోట్లు
విశాఖపట్నం, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
అగనంపూడిలోని మెడ్టెక్ జోన్కు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి క్వార్టర్కు రూ.8.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకో రూ.25.5 కోట్లను దశల వారీగా ఏడాది పూర్తయ్యేలోగా ఇస్తారు.
Updated Date - Jun 04 , 2025 | 12:57 AM