పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:24 PM
గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ తెలిపారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్
పాడేరు మండలం డి.గొందూరులో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
పాడేరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ తెలిపారు. పాడేరు మండలం డి.గొందూరు గ్రామ పంచాయతీ ఆవరణలో ’జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం’ సందర్భంగా గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వికసిత పంచాయతీ పథకంలో ఎంపికైన 15 గ్రామాల్లో డి.గొందూరు పంచాయతీ ఉందని, పంచాయతీ అవసరాలను గుర్తించి గ్రామసభలో తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ నిధులతో పాటు, లైన్ డిపార్టుమెంటులో అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మహిళలు పొందిన బ్యాంకు లింకేజీలు సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు చేయాలన్నారు. నిరుద్యోగ యువత వ్యసనాలకు బానిస కాకుండా ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ప్రధానమంత్రి జన్మన్ పథకంలోని 15 మంది లబ్థిదారులకు గృహ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం రూ.2.39 లక్షలు ఇస్తుందని, లబ్థిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాలని కలెకర్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, హౌసింగ్ ఈఈ బి.బాబు, ఈవో పీఆర్డీ రమేశ్, నీతి ఆయోగ్ ప్రతినిధి చైతన్యరెడ్డి, సర్పంచ్ సీదరి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:24 PM