ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ABN, Publish Date - Jul 17 , 2025 | 10:57 PM
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ అన్నారు.
ప్రజా దర్బార్లో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్
పాడేరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంటరీ అధ్యక్షుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ అన్నారు. స్థానిక తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఫలితంగా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి ఆయన వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. హుకుంపేటకు చెందిన జి.వసంతరాణి తన భూమి వ్యవహారం కోర్టులో ఉండగానే ప్రత్యర్థులు ఆ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని తెలపగా, ఈ సమస్యపై సబ్కలెక్టర్ శౌర్యమన్పటేల్తో మాట్లాడారు. అలాగే అరకులోయ మండలం మాడగడ వ్యూపాయింట్ వద్ద పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని ఆటో యూనియన్ ప్రతినిధులు కోరగా, దీనిపై డీఎస్పీ షహబాజ్ అహ్మద్తో మాట్లాడారు. డుంబ్రిగుడ మండలం తడ్డా గ్రామానికి మంజూరైన రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని పలువురు కోరగా, అటవీ శాఖాధికారులతో చర్చించారు. ఇలా అనేక మంది గిరిజనులు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను జీసీసీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సాగర సుబ్బారావు, పాండురంగస్వామి, వాసుదేవ్, అమ్మన్న, ప్రసాద్, రామలింగం, మురళీ, లైకోన్, కిశోర్, కళావతి, అచ్చిబాబు, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 10:57 PM