ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు
ABN, Publish Date - May 11 , 2025 | 01:25 AM
విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం ముందు వీటిని వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల కోసమని ప్రకటించింది.
అక్కయ్యపాలెం నుంచి ప్రారంభం
నెలకు 200 యూనిట్లు మించి వినియోగించే వారికి తొలి ప్రాధాన్యం
బిల్లు ముందుగానే కట్టాల్సి ఉంటుందంటున్న అధికారులు
ఎప్పటికప్పుడు రీచార్జ్ చేసుకోవాలి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం ముందు వీటిని వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల కోసమని ప్రకటించింది. ఆ తరువాత ప్రతి వినియోగదారుడికి అందిస్తామని పేర్కొంది. విద్యుత్ బిల్లులు వంద శాతం ముందుగానే వసూలు చేసుకోవడానికి వీటిని తీసుకువచ్చారనేది సుస్పష్టం. అయితే ప్రభుత్వ సంస్థల నుంచే తమకు బిల్లుల ఇబ్బంది ఉంది కాబట్టి ముందుగా ఆ కార్యాలయాలకే మీటర్లు ఏర్పాటుచేస్తామని విశాఖ సర్కిల్ అధికారులు తెలిపారు. జిల్లాలో మూడు వేల ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా, గత ఏడాది ఆగస్టులో తొలి స్మార్ట్ మీటర్ను సీతమ్మధారలోని ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఆ తరువాత వాణిజ్య వినియోగదారులకు బిగిస్తామని, అనంతరం ఎక్కువ విద్యుత్ అంటే నెలకు 200 యూనిట్లు దాటి ఉపయోగించే వారికి ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 17.45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా, విశాఖ సర్కిల్ అధికారులు 1.19 లక్షల స్మార్ట్ మీటర్లు సరిపోతాయని అంచనా వేసుకున్నారు. ఆ మేరకు ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు. ఈ మీటరు ఒక్కింటికి అన్ని ఖర్చులతోను రూ.6 వేలు పడుతుంది. అయితే వినియోగదారుల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ సంస్థలకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. ఆ తరువాత వాణిజ్య వినియోగదారులకు వీటిని ఇస్తున్నారు. ఆ విభాగం కూడా పూర్తయితే ఆ తరువాత ఎక్కువ విద్యుత్ వినియోగించే గృహాలకు ఏర్పాటుచేస్తామని చెబుతున్నారు. అయితే ప్రయోగాత్మకంగా నగరంలోని అక్కయ్యపాలెంలో రెండు రోజుల క్రితం సాధారణ గృహాలకు ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించారు. పాత మీటర్లు తీసేసి, కొత్తవి ఇస్తున్నారు.
స్మార్ట్ మీటర్లు కొందరికే...
శ్యాంబాబు, ఎస్ఈ, విశాఖ సర్కిల్
స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగదారులు అందరికీ ఇవ్వం. ఎక్కువ విద్యుత్ అంటే నెలకు 200 యూనిట్లు పైబడి ఉపయోగించే వారికి మాత్రమే ఏర్పాటుచేస్తాం. మిగిలిన వారికి పాత మీటర్లే ఉంటాయి. గ్రూపు హౌస్లు, అపార్ట్మెంట్లలో ఉండేవారికి తప్పనిసరి అనే నిబంధన కూడా లేదు. తక్కువ విద్యుత్ ఉపయోగించుకొని, ప్రభుత్వ రాయితీ పొందే వర్గాలకు ఇవ్వరు. స్మార్ట్ మీటర్ల వ్యయం వినియోగదారుల నుంచి వసూలు చేస్తారనే అపోహలు కూడా ఉన్నాయి. ఈపీడీసీఎల్ ఎప్పుడూ మీటర్ల వ్యయం వినియోగదారుల నుంచి వసూలు చేయలేదు. అది సంస్థ ఆస్తిగానే ఉంటుంది. కాకపోతే స్మార్ట్ మీటరు పెట్టుకునేవారు ముందుగానే వారి సగటు వినియోగం ఎంతో ఆ మొత్తంతో రీచార్జి చేసుకోవలసి ఉంటుంది.
Updated Date - May 11 , 2025 | 01:25 AM