మందకొడిగా ఇంటర్ ప్రవేశాలు
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:16 AM
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు మందకొడిగా జరుగుతున్నాయి. అడ్మిషన్లకు ఈ నెలాఖరు వరకు గడువు వున్నప్పటికీ ఇంతవరకు సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. పట్టణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు ఒకింత మెరుగ్గా వుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో చాలా వరకు సీట్లు భర్తీకాలేదు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరికకు ఆసక్తి చూపని విద్యార్థులు
తొలి విడత ప్రవేశాలకు ఈ నెలాఖరు వరకు గడువు
ఇంతవరకు సగం సీట్లు కూడా భర్తీకాని పరిస్థితి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు మందకొడిగా జరుగుతున్నాయి. అడ్మిషన్లకు ఈ నెలాఖరు వరకు గడువు వున్నప్పటికీ ఇంతవరకు సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. పట్టణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ప్రవేశాలు ఒకింత మెరుగ్గా వుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో చాలా వరకు సీట్లు భర్తీకాలేదు.
జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దాదాపు అన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు, ఓకేషనల్ కోర్సులు ఉన్నాయి. ఫస్టియర్ జనరల్ విభాగంలో 2,750 సీట్లు, ఒకేషనల్ కోర్సుల్లో 650 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 30వ తేదీనాటికి తొలి విడత ప్రవేశాలు పూర్తికావాలి. అయితే ఇంతవరకు జరిగిన ప్రవేశాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదేమోనన్న అనుమానం కలుగుతున్నది. మొత్తం మీద ఇంతవరకు సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. ఈ నెలాఖరుకు ఎంతమంది చేరతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందిస్తున్నారు. ఖాళీ అధ్యాపక పోస్టుల్లో గెస్ట్ లెక్చరర్లను నియమిస్తున్నారు. ఇన్ని చేసినప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఎందుకు ఆసక్తి చూపడంలేదో అర్థం కావడం లేదని అధికారులు అంటున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్లో ఇప్పటి వరకు 1,190 మంది విద్యార్థులు చేరారు. వీరిలో జనరల్ విభాగంలో 834, ఒకేషనల్ విభాగంలో 356 మంది వున్నారు. ఎలమంచిలి, నర్సీపట్నం, నక్కపల్లి, సబ్బవరం కళాశాలల్లో ప్రవేశాలు ఒకింత ఆశాజనకంగానే వున్నాయి. శుక్రవారం నాటికి అన్ని గ్రూపులు కలిపి ఎలమంచిలి కళాశాలలో 239 మంది, నక్కపల్లిలో 161 మంది, నర్సీపట్నం మహిళా కళాశాలలో 139 మంది, అనకాపల్లిలో 62 మంది, చోడవరంలో 72 మంది, దేవరాపల్లిలో 51, కోటవురట్ల 31, కృష్ణాదేవిపేటలో 31, మాకవరపాలెంలో 49, నర్సీపట్నం బాలుర కళాశాలలో 39, పరవాడలో 72, పాయకరావుపేటలో 48, రోలుగుంటలో 59, సబ్బవరంలో 78, వి.మాడుగులలో 36, వడ్డాది కళాశాలలో 23 మంది విద్యార్థులు చేరారు.
ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలి
సుజాత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. సొంత భవనాలు, విశాలమైన తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు చేపట్టాం. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలి.
Updated Date - Jun 21 , 2025 | 12:16 AM