27 మంది వైసీపీ కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసు
ABN, Publish Date - Jul 17 , 2025 | 01:14 AM
జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేశారనే అభియోగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గత మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై ఈ ఏడాది మార్చిలో కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విప్ను ధిక్కరించారని కలెక్టర్కు పార్టీ ఫిర్యాదు
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి ఓటు వేశారనే అభియోగంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కార్పొరేటర్లకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గత మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై ఈ ఏడాది మార్చిలో కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్కు నోటీస్ ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై కూడా అవిశ్వాసం ప్రకటించారు. ఆ నోటీస్ల ఆధారంగా ఏప్రిల్ 19న మేయర్ హరివెంకటకుమారిపైనా, 22న జియ్యాని శ్రీధర్పైనా ఓటింగ్ నిర్వహించారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశిస్తూ ఆ పార్టీ విప్ జారీచేసింది. కానీ 27 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిపోయి మేయర్, డిప్యూటీ మేయర్లపై పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ పదవిని కోల్పోయారు. పార్టీ విప్ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్కు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తైనాల విజయ్కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపించిన జిల్లా కలెక్టర్, అక్కడి నుంచి అందిన ఆదేశాల మేరకు విప్ను ఉల్లంఘించి ఓటేసిన 27 మంది కార్పొరేటర్లకు మునిసిపల్ కార్పొరేషన్ రూల్స్-2008లోని రూల్ నంబర్ 17 ప్రకారం నోటీసులు జారీచేశారు. నోటీస్ అందుకున్న వారంతా వారం రోజుల్లోగా తమ వివరణను తెలియజేయాలని, లేనిపక్షంలో తదుపరి చర్యలకు అర్హులవుతారని పేర్కొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 01:15 AM