బ్యాంకులకు తల్లికి వందనం తాకిడి
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:50 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం కింద బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులు డ్రా చేయడానికి మహిళలు బ్యాంకుల బాట పట్టారు. దీంతో అన్ని బ్యాంకుల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.
ఖాతాల నుంచి నగదు తీసుకోవడానికి వచ్చిన వారితో కిటకిట
దేవరాపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం కింద బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులు డ్రా చేయడానికి మహిళలు బ్యాంకుల బాట పట్టారు. దీంతో అన్ని బ్యాంకుల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. బ్యాంకులకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతోపాటు తల్లికి వందనం డబ్బులు తీసుకోవడానికి వచ్చిన మహిళలతో బ్యాంకులు కిటకిటలాడాయి. కొంతమంది మహిళలు తమ ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయో, లేదో వాకబు చేయడానికి రాగా, అత్యధికులు డబ్బులు డ్రా చేయడానికి వచ్చారు. స్కూళ్లు తెరవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు, యూనిఫారం కొనుగోలు చేయడానికి ‘తల్లికి వందనం’ డబ్బులు ఆసరాగా నిలిచాయని ఈ సందర్భంగా పలువురు తల్లులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దేవరాపల్లిలోని యూకో బ్యాంకు, మూడు వినియోగదారుల సేవా కేంద్రాలు, ఎస్బీఐ, దాని వినియోగదారుల సేవా కేంద్రం ద్వారా సుమారు రూ.20 లక్షల మేర చెల్లింపులు జరిగినట్టు ఆయా బ్యాంకుల అధికారుల ద్వారా తెలిసింది. దేవరాపల్లి మండలంతోపాటు పక్కనే వున్న అనంతగిరి మండలానికి చెందిన నాలుగు పంచాయతీల ప్రజలు కూడా దేవరాపల్లిలోనే బ్యాంకు సేవలు పొందుతుంటారు.
Updated Date - Jun 17 , 2025 | 12:50 AM