కోరే ఆర్గానిక్స్తో ‘సాయి శ్రేయాస్’ రహస్య ఒప్పందం
ABN, Publish Date - Jun 24 , 2025 | 01:34 AM
పరవాడ ఫార్మా సిటీలో పది రోజుల క్రితం సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఇప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రాలేదు.
ఆ కంపెనీ కోసం మందు తయారుచేస్తున్నప్పుడే ప్రమాదం
ఆ వివరాలు సరిగా లేవని ఉన్నతాధికారులకు డ్రగ్ ఇన్స్పెక్టర్ నివేదిక
వెలువడింది ‘హెచ్2ఎస్’గా ఎలా నిర్ధారించారో చెప్పాలని శాస్త్రవేత్తల డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పరవాడ ఫార్మా సిటీలో పది రోజుల క్రితం సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఇప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రాలేదు. ఎటోరికాక్సిబ్ మందు తయారుచేసిన తరువాత వచ్చిన వ్యర్థాలను న్యూట్రలైజ్ చేస్తుండగా విషవాయువు (హైడ్రోజన్ సల్ఫైడ్-హెచ్2ఎస్) విడుదల కాగా దానిని పీల్చి ఇద్దరు మరణించారని యాజమాన్యం పేర్కొంది. దానినే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. అయితే ఈ కంపెనీలో చాలా అడ్డగోలు వ్యవహారాలు ఉన్నాయని విచారణలో తేలింది.
సాయి శ్రేయాస్ను ఆనుకొని ‘కోరె ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే మరో సంస్థ ఉంది. ఈ రెండు సంస్థల మధ్య రహస్య ఒప్పందం ఉందని డ్రగ్ కంట్రోల్ అథారిటీ గుర్తించింది. కోరె ఆర్గానిక్స్ కంపెనీని యూనిట్-2గా సాయి శ్రేయాస్ తన రికార్డుల్లో చూపించింది. ఇది బయట ప్రపంచానికి తెలియదు. ఆ రోజు ప్రమాదానికి కారణమైన ఎటోరికాక్సిబ్ మందు కూడా కోరె ఆర్గానిక్స్ కోసమే తయారుచేసినట్టు అధికారులు తేల్చారు. దాంతో పాటు మరో ఆరు రకాల మందులను వారి కోసం సాయి శ్రేయాస్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వీటికి సంబంధించిన టెక్నాలజీని కోరె ఆర్గానిక్స్ అందించగా, మందులు తాము తయారుచేస్తున్నట్టు సాయి శ్రేయాస్ యాజమాన్యం అధికారులకు తెలిపినట్టు సమాచారం. అయితే వీటికి సంబంధించిన పత్రాల్లో ఈ మందుల తయారీలో పాటించాల్సిన విధి విధానాలు, వ్యర్థాల ట్రీట్మెంట్కు సంబంధించి సరైన వివరాలు లేవని ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసులో సాయి శ్రేయాస్తో పాటు కోరె ఆర్గానిక్స్పై కేసు పెడతారా?, ఆ యూనిట్ని కూడా మూసివేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
అది హెచ్2ఎస్ ఎలా నిర్ధారించారు?
ఎటోరికాక్సిబ్ వ్యర్థాలను శుద్ధి చేస్తుండగా హెచ్2ఎస్ విడుదలైందని, దానిని పీల్చి సేఫ్టీ అధికారులు ఇద్దరు మరణించారని కంపెనీ యాజమాన్యం చెబితే...దానినే పీసీబీ, ఫ్యాక్టరీస్ విభాగం నిర్ధారించింది. అయితే అక్కడ హెచ్2ఎస్ ఎలా వచ్చిందనేది శాస్త్రీయంగా నిరూపించలేదని ప్రజా శాస్త్రవేత్తల బృందం ప్రతినిధులు డాక్టర్ బాబూరావు, డాక్టర్ కె.వెంకటరెడ్డి, డాక్టర్ డి.రాంబాబు, డాక్టర్ కె.కోటేశ్వరరావులు పీసీబీకి రాసిన లేఖలో ఆరోపించారు. ప్రమాదం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో జరిగితే ఉదయం ఏడు గంటలకు ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించారు. హెచ్2ఎస్ వెలువడడానికి ముందు జరిగిన రసాయన ప్రక్రియ ఏమిటనేది పీసీబీ ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఎలా దానిని నిర్ధారించారో చెప్పాలన్నారు. పోస్టుమార్టం నివేదికలో ఏమి వచ్చిందో కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎటోరికాక్సిబ్ వ్యర్థాలను రాత్రికి రాత్రి ఉద్యోగులను ఇంటి నుంచి పిలిపించి న్యూట్రలైజేషన్ చేయాల్సిన అవసరం ఏమిటనే దానిపై విచారణ ఎందుకు చేయడం లేదని వారు అనుమానాలు వ్యక్తంచేశారు.
Updated Date - Jun 24 , 2025 | 01:34 AM