కత్తులతో బెదిరించి దోపిడీ
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:51 PM
పింఛన్ సొమ్ముతో బైక్పై వెళుతున్న సచివాలయం ఉద్యోగిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో బెదిరించి నగదు అపహరించిన సంఘటన మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సచివాలయం ఉద్యోగి నుంచి పింఛన్ సొమ్ము కాజేసిన ఇద్దరు దొంగలు
నిందితులు ఉపయోగించిన వాహనం స్వాధీనం
ఆంధ్ర, ఒడిశా పోలీసుల గాలింపు
ముంచంగిపుట్టు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పింఛన్ సొమ్ముతో బైక్పై వెళుతున్న సచివాలయం ఉద్యోగిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో బెదిరించి నగదు అపహరించిన సంఘటన మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం బొండాపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కటారి మత్య్సరాజు లబ్ధిదారులకు పింఛన్ నగదు చెల్లించడానికి పెదబయలు ఎస్బీఐ బ్రాంచి నుంచి రూ.17 లక్షల 53 వేల 200లు విత్డ్రా చేశాడు. డిజిటల్ అసిస్టెంట్కు రూ.లక్షా 47 వేల నగదు ఇచ్చి, మిగతా సొమ్ముతో స్వగ్రామమైన ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీ చెరువుపాకలకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. కత్తులు, తుపాకీతో బెదిరించి అతని నుంచి నగదు లాక్కుని ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. అదే సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వస్తున్న సీతగుంట పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావుకు విషయం చెప్పడంతో ఇద్దరూ కలిసి దొంగలను వెంబడించారు. ఒడిశా రాష్ట్రంలోని పాడువ వైపు దొంగలు వెళుతూ బలియగుడ వద్ద అదుపుతప్పి పడిపోయారు. దీంతో వాహనాన్ని వదిలేసి గాయాలతోనే కొండ వైపు పరుగులు తీశారు. బాధితుడు మత్స్యరాజు.. దొంగలు వదిలేసిన వాహనాన్ని, రెండు సెల్ఫోన్లను తీసుకుని ఎంపీడీవో పూర్ణయ్య సమక్షంలో ముంచంగిపుట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ ఆ ద్విచక్ర వాహనాన్ని పరిశీలించగా, అందులో రూ.5 లక్షల నగదు దొరికింది. మిగతా సొమ్ముతో దొంగలు పరారైనట్టు పోలీసులు గుర్తించి, పాడువ, పెదబయలు మండల పోలీసుల సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - Jul 31 , 2025 | 11:51 PM