ఎక్కడికక్కడ రోడ్ల తవ్వకం
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:13 AM
నగరంలో విద్యుత్ కేబుళ్లు, నీటి సరఫరా పైప్లైన్లు, యూజీడీ పైప్లైన్ల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ రోడ్లను తవ్వేస్తున్నారు. ఆ మట్టిని రోడ్డుపైనే వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతమంతా బురదమయమవుతోంది. ఇది వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారుతోంది.
యూజీడీ, నీటి సరఫరా,
విద్యుత్ కేబుళ్ల కోసం కొత్తగా నిర్మించినా రహదారులనూ తవ్వేస్తున్నారు
నిబంధనలకు పాతర
మట్టిని ఖాళీ స్థలంలో పోయాల్సి ఉన్నా
రోడ్డుపైనే వదిలేస్తున్న వైనం
ఇప్పుడు వర్షాలకు ఆ ప్రాంతమంతా బురదమయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో విద్యుత్ కేబుళ్లు, నీటి సరఫరా పైప్లైన్లు, యూజీడీ పైప్లైన్ల నిర్మాణం కోసం ఎక్కడికక్కడ రోడ్లను తవ్వేస్తున్నారు. ఆ మట్టిని రోడ్డుపైనే వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతమంతా బురదమయమవుతోంది. ఇది వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారుతోంది.
నగరంలో అమృత్ పథకం కింద తాగునీటి పైప్లైన్ల నిర్మాణం చాలాకాలంగా సాగుతోంది. మరోవైపు అమృత్-2 పథకం కింద యూజీడీ పైప్లైన్లను వేసే పనులు కూడా గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో అండర్గ్రౌండ్ కేబుల్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నిపనులు ఏకకాలంలో సాగుతుండడంతో నగరంలో ఎక్కడచూసినా రోడ్లను తవ్వుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. రోడ్లను ఏదైనా అవసరం కోసం తవ్వాల్సి వస్తే, జీవీఎంసీ అనుమతించిన మేరకు మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదేరీతిలో గోతులను తవ్వి, మట్టిని రోడ్డుపై ఉంచకుండా సమీపంలో ఏదైనా ఖాళీస్థలంలో పోగువెయ్యాలి. గోతుల్లో కేబుల్/పైపులు వేసిన తర్వాత భవిష్యత్తులో రోడ్డు అక్కడ కుంగిపోకుండా ఉండేందుకు ఒక పద్ధతి ప్రకారం తిరిగి పూడ్చాల్సి ఉంటుంది. కేబుల్ అయితే ముందుగా కొంతవరకు మట్టి వేసి తర్వాత చిప్స్తో పూడ్చాలి. తర్వాత కాంక్రీట్ వేసి, ఆపైన తిరిగి బీటీ వేసి ఆ ప్రాంతంలో వున్న తారురోడ్డులో కలిసిపోయి ఏకరూపంలో ఉండేలా చేయాలి. అలా చేస్తే భవిష్యత్తులో తవ్వినచోట రోడ్డు కుంగిపోకుండా ఉంటుంది. అయితే నగరంలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు తవ్వకాల పనుల్లో ఈ నిబంధనలేవి పాటించడం లేదు. అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ నుంచి తాటిచెట్లపాలెం బజారు వరకూ ఉన్న 80 ఫీట్రోడ్డులో అండర్గ్రౌండ్ కేబుల్ కోసం కొద్దిరోజులుగా తవ్వుతున్నారు. తవ్వేసిన మట్టి వర్షాలకు బురదగా రోడ్డుపైకి వచ్చేస్తోంది. దీనివల్ల వాహనచోదకులు ఇబ్బందిపడుతున్నారు. సీతమ్మధార ప్రాంతంలో అమృత్ పథకం కింద తాగునీటి పైప్లైన్ల కోసం రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఎంపీవీ కాలనీలో అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం రోడ్లను తవ్వేస్తున్నారు. తవ్వేసిన మట్టిని ఖాళీ స్థలానికి తరలించాల్సి ఉన్నప్పటికీ, రోడ్డుపైనే వదిలేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ ఉండే డబుల్ రోడ్డులో వాహనచోదకులు ఇబ్బందిపడాల్సివస్తోంది.
చోద్యంచూస్తున్న జీవీఎంసీ అధికారులు
నగరంలో కొత్తగా వేసినరోడ్లను వివిధ అవసరాలకు తవ్వేస్తున్నా సరే జీవీఎంసీ అధికారులు కనీసం అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ అధికారులు ఏదైనా ఒకరోడ్డుని వేయాలనుకుంటే, ముందే ఆ ప్రాంతంలో కేబుల్స్, పైప్లైన్లను వేయాల్సిన అవసరం ఉందేమో ఈపీడీసీఎల్, జీవీఎంసీ ప్రాజెక్ట్స్, నీటిసరఫరా, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో చర్చించినట్టయితే కొత్తరోడ్లను అలా తవ్వాల్సిన పరిస్థితి ఉండదు. జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొత్తరోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ ఆ రహదారి నిర్వహణ బాధ్యతలు ఐదేళ్లపాటు చూడాల్సి ఉన్నాసరే, తవ్వేసినందున తనకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. దీనివల్ల రోడ్డు నిర్వహణభారం కూడా జీవీఎంసీపైనే పడుతోంది.
త్వరలో సమన్వయ సమావేశం ఏర్పాటుచేస్తాం
పల్లంరాజు, జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్
నగరంలో ఎక్కడికక్కడ రోడ్లను తవ్వేస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కొత్తగా వేసిన రోడ్లను సైతం వెంటనే కేబుల్/పైప్లైన్ కోసం తవ్వేస్తున్నమాట వాస్తవమే. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. రోడ్లను క్రమపద్ధతిలో తవ్వడంతోపాటు కొత్తరోడ్డు నిర్మిస్తున్నప్పుడు ఈపీడీసీఎల్, జీవీఎంసీ ప్రాజెక్స్, నీటిసరఫరా విభాగం అధికారులతో పబ్లిక్వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా సమన్వయ సమావేశం త్వరలోనే ఏర్పాటుచేస్తాను. దీనివల్ల ఏదైనా రోడ్డులో పైప్లైన్/కేబుల్ వేయాల్సి ఉందంటే ఆ పనులు పూర్తయిన తర్వాతే రోడ్డు నిర్మాణం జరిగేలా చూస్తాం.
Updated Date - Jul 03 , 2025 | 01:13 AM