హౌసింగ్లోకి విశ్రాంత అధికారులు
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:38 AM
గృహనిర్మాణ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లా నుంచి సుమారు 20 మంది దరఖాస్తు
అవుట్ సోర్సింగ్ విఽధానంలో నియామకాలు
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
గృహనిర్మాణ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరితో పాటు అవుట్ సోర్సింగ్ విధానంలో యువ ఇంజనీర్లు, డిప్లొమా హోల్డర్లను నియమించాలని యోచిస్తోంది. ఈ మేరకు జిల్లా నుంచి సుమారు 20 మంది విశ్రాంత అధికారులు పోస్టింగ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం రిటైర్డ్ డీఈ బీఆర్వీ ప్రసాద్ను తిరిగి సర్వీసులోకి తీసుకున్నారు. విశ్రాంత అధికారులు విజయలక్ష్మి, ప్రసంగరాజు దరఖాస్తులు గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయి. దీంతో మరికొందరు దరఖాస్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారుల కొరతతో కేంద్రం మంజూరుచేసిన పీఎంఏవై పథకం నిర్దేశించిన లక్ష్యం మేరకు అమలుకావడంలేదు. ఏళ్లతరబడి హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగ విమరణలే తప్ప నూతన నియామయాలు లేవు. పైగా ఏటా ఉద్యోగ విరమణతో వర్క్ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఈ/సీఈ వరకు పోస్టులు ఖాళీ అవుతున్నాయి.
జిల్లాలో పరిస్థితి...
జిల్లాలో రెండు ఈఈ పోస్టులుండగా విశాఖ ఈఈ ఆళ్ల శ్రీనివాసరావు ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. టెక్కలి ఈఈ సూరిబాబును డిప్యూటేషన్పై భీమునిపట్నంలో నియమించారు. జిల్లాలో ఆరుగురు డీఈలకు ఇద్దరే ఉన్నారు. ప్రతి మండలానికి ఒక ఏఈ, జిల్లా కార్యాలయంలో మరికొందరు వెరసి కనీసం 15 మంది అధికారులుండాలి. అయితే రెగ్యులర్ కేడర్లో ముగ్గురు మాత్రమే ఉండగా మరో నలుగురైదుగురు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్లర్ల వ్యవస్థ దాదాపు కనుమరుగయింది. ప్రతి 1000 ఇళ్లకు ఒక ఏఈ ఉండాలని అప్పట్లో ప్రభుత్వం డిజైన్ చేసింది.
జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1.2 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారు. నగరంలోని పేదలకు లక్షకుపైగా ఇళ్లను అందించే ప్రక్రియ అమలుచేస్తున్నారు. ఆ తరువాత కూడా కనీసం 10 నుంచి 20 వేల ఇళ్లు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో 20 మంది ఏఈలు ఉండాలి. పైగా అధికారుల కొరతతో ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడుతోందనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటన్నింటిని పరిగణనలోనికి తీసుకున్న ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్లో సేవలకు విశ్రాంత అధికారులను తీసుకుంటున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
Updated Date - Jul 21 , 2025 | 12:38 AM