జోన్ల పునర్విభజన
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:15 AM
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని ఎనిమిది జోన్లను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జోన్లో ఉండేలా చూడాలని నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతిపాదనలు తయారుచేసి కౌన్సిల్ ఆమోదానికి పెట్టాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు జోన్ల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో నిమగ్నమయ్యారు.
అసెంబ్లీ నియోజకవర్గమంతా
ఒకే జోన్ పరిధిలోకి ఉండేలా చూడాలని
ప్రభుత్వానికి ఎమ్మెల్యేల విజ్ఞప్తి
ప్రతిపాదనలు తయారుచేస్తున్న జీవీఎంసీ అధికారులు
కౌన్సిల్లో టేబుల్ అజెండాగా చేర్చాలని యోచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని ఎనిమిది జోన్లను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. పాలనా సౌలభ్యం కోసం ఒక అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జోన్లో ఉండేలా చూడాలని నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతిపాదనలు తయారుచేసి కౌన్సిల్ ఆమోదానికి పెట్టాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు జోన్ల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో నిమగ్నమయ్యారు.
జీవీఎంసీ పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పు, దక్షిణం, ఉత్తర, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాలు పూర్తిగా, భీమిలి నియోజకవర్గంలో నాలుగు వార్డులు, అనకాపల్లి నియోజకవర్గం పరిధిలో ఐదు వార్డులు, పెందుర్తి నియోజకవర్గం పరిధిలో పది వార్డులు జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను ఎనిమిది జోన్లుగా విభజించి, ఒక్కో జోన్లో జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి జోన్ పరిధిలోని ప్రజలకు అవసరమైన సేవలు అందుతుంటాయి. అయితే ఒక జోన్ పరిధిలో మూడు, నాలుగు నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు ఉండడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు జోన్-5 (జ్ఞానాపురం)లో దక్షిణం, ఉత్తరం, పశ్చిమ, భీమిలి నియోజకవర్గాలకు చెందిన ప్రాంతాలు, జోన్-3 (ఆశీల్మెట్ట)లో తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క జోన్-7 (అనకాపల్లి), జోన్-1 (భీమిలి) మినహాయిస్తే మిగిలిన జోన్లలో రెండు, అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల ప్రాంతాలు ఉన్నాయి. దీనివల్ల అధికారులకు పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతోపాటు ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాలంటే రెండు, అంతకంటే ఎక్కువ జోన్ల అధికారులను పిలవాల్సి వస్తోంది. ఇది కొంత ఇబ్బందిగా ఉన్నందున తమ నియోజకవర్గాన్ని ఒకే జోన్ పరిధిలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యేలు ఇటీవల రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎమ్మెల్యేల విజ్ఞప్తికి అనుగుణంగా జోన్ల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. జీవీఎంసీలో ఒక అదనపు కమిషనర్తోపాటు టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు కలిసి జోన్ల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించారు. ఈనెల ఆరున జరిగే కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనను టేబుల్ అజెండాగా చేర్చి చర్చించనున్నారు. కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత తదుపరి చర్యలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలావుంటే జీవీఎంసీ పరిధిలోని జోన్ల పునర్విభజనపై తమకు కనీసం సమాచారం ఇవ్వలేదంటూ కొందరు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పునర్విభజన ఆలోచన మంచిదే అయినప్పటికీ తమ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ప్రతిపాదనను కౌన్సిల్లో చర్చించేందుకు అజెండాలో చేర్చాలనే విషయాన్ని అధికారులు విస్మరించారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 01:15 AM