రోడ్డుపై రేషన్కు చెల్లు చీటీ!
ABN, Publish Date - May 31 , 2025 | 12:53 AM
రేషన్ సరకులు అందించే ఎండీయూ వాహనం ఎప్పుడొస్తుందా అని కార్డుదారులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రేషన్ కోసం బియ్యం కార్డుదారులు వీధుల్లో, రోడ్లపైన నిరీక్షించాల్సిన పనిలేదు. ఐదారేళ్ల క్రితం మాదిరిగానే తమకు వెసులుబాటు వున్న సమయంలో చౌక ధరల దుకాణానికి వెళ్లి సరకులు విడిపించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటి నుంచి రేషన్ డిపోల్లోనే సరకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని అన్ని డిపోలకు ఇప్పటికే సరకులు చేరాయి.
మూలకు చేరిన ఎండీయూ వాహనాలు
రేపటి నుంచి చౌక ధరల దుకాణాల్లో సరకులు పంపిణీ
పక్షం రోజుల్లో ఎప్పుడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు
ఉదయం నాలుగు, సాయంత్రం నాలుగు గంటలపాటు డిపోలు ఓపెన్
వీధుల్లో నిరీక్షించాల్సిన దుస్థితి తప్పిందని కార్డుదారులు సంతోషం
అనకాపల్లి కలెక్టరేట్, మే 30 (ఆంధ్రజ్యోతి): రేషన్ సరకులు అందించే ఎండీయూ వాహనం ఎప్పుడొస్తుందా అని కార్డుదారులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రేషన్ కోసం బియ్యం కార్డుదారులు వీధుల్లో, రోడ్లపైన నిరీక్షించాల్సిన పనిలేదు. ఐదారేళ్ల క్రితం మాదిరిగానే తమకు వెసులుబాటు వున్న సమయంలో చౌక ధరల దుకాణానికి వెళ్లి సరకులు విడిపించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటి నుంచి రేషన్ డిపోల్లోనే సరకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని అన్ని డిపోలకు ఇప్పటికే సరకులు చేరాయి.
జిల్లాలో ప్రస్తుతం 1,069 చౌకధరల దుకాణాల పరిధిలో 5,37,038 రేషన్ కార్డులు వున్నాయి. గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో ఎండీయూ వ్యవస్థను తీసుకువచ్చింది. రేషన్ డిపోలకు వెళ్లాల్సిన పనిలేదని, కార్డుదారుల ఇళ్ల వద్దకు వ్యాన్ వచ్చి రేషన్ అందజేస్తారని ప్రకటించింది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి నాటి ప్రభుత్వం చెప్పినట్టు జరగలేదు. ఎండీయూ వాహనాలు వీధి చివరిలో, కూడలిలో లేదంటే వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద నిలిపేవారు. కార్డుదారులు అక్కడకు వెళ్లి రోడ్డుపై క్యూలో నిల్చుని సరకులు తీసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో కూలి పనులు, ఇతర కారణాల వల్ల ఇళ్ల వద్ద లేకపోతే మరుసటి రోజు ఎండీయూ వాహనం ఎక్కడుందో కనుక్కొని అక్కడకు, ఎక్కువ సేపు క్యూలో నిల్చుని సరకులు తీసుకోవాల్సి వచ్చేది. దీంతో రోజు వారీ కూలి పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు సరకులు తీసుకోలేని పరిస్థితి ఏర్పడేది. అంతేకాక ఎండీయూ ఆపరేటర్లు.. కార్డుదారుల నుంచి నామ మాత్రపు ధరకు బియ్యం కొనుగోలు చేసేవారు. ఐపోస్ యంత్రంలో వేలి ముద్ర వేయించుకుని కిలోకు రూ.10-12 ఇచ్చేవారు. అనంతరం ఆ బియ్యాన్ని దొడ్డిదారిన దళారులకు, రైస్ మిల్లర్లకు కిలో రూ.15-20 వరకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చినా.. అధికారులు పట్టించుకునేవారుకాదు. బియ్యం మాఫియా వెనుక నాటి అధికార పార్టీ నేతలు వుండడమే కారణం. ఈ నేపథ్యంలో గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్ రేషన్ పంపిణీపై ప్రత్యేక దృష్టిసారించారు. రాష్ట్రంలో పలుచోట్ల దాడులు నిర్వహించిన గోదాముల్లో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎండీయూ ఆపరేట్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో జూన్ నుంచి ఈ వాహనాలను నిలిపివేసి, రేషన్ డిపోల్లోనే సరకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఆదివారం నుంచి కార్డుదారులు తమకు వెసులుబాటు వున్న సమయంలో రేషన్ డిపోకు వెళ్లి సరకులు విడిపించుకోవచ్చు. దీంతో కార్డుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ నెలకు సంబంధించి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వున్న ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి అన్ని రేషన్ డిపోలకు 7,606 టన్నుల బియ్యం, 264 టన్నుల పంచదార సరఫరా చేశామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. సరకులు పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే సరకులు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రేషన్ డీలర్ల సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి కేవీఎల్ఎన్ మూర్తి తెలిపారు.
రేషన్ డిపోలు తెరిచే వేళలు..
ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాలను తెరిచి వుంచి, సరకులు పంపిణీ చేయాలి. కార్డుదారులు ఆయా రోజుల్లో తమకు వెసులుబాటు ఉన్న సమయంలో సరకులు పొందవచ్చు. .
Updated Date - May 31 , 2025 | 12:53 AM