ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:18 PM
ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జిల్లా పంచాయతీరాజ్ అధికారి(డీపీవో) కేపీ చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన పెదబరడ, లోతుగెడ్డ జంక్షన్, వంచుల, రింతాడ గ్రామాల్లో పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు.
పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్న ప్రభుత్వం
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు
డీపీవో చంద్రశేఖరరావు
చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటన
చింతపల్లి/గూడెంకొత్తవీధి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జిల్లా పంచాయతీరాజ్ అధికారి(డీపీవో) కేపీ చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన పెదబరడ, లోతుగెడ్డ జంక్షన్, వంచుల, రింతాడ గ్రామాల్లో పంచాయతీ కార్మికులు నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్శాఖా మంత్రి పవన్ కల్యాణ్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే గృహాలు, వీధులు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని సంకల్పించి పారిశుధ్యం మెరుగు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జడ్పీ సీఈవో, పంచాయతీరాజ్ అధికారి, డీఎల్పీవో, ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, కార్యదర్శి, మహిళా కానిస్టేబుల్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పంచాయతీ కార్మికులతో కలిసి గృహాల నుంచి నేరుగా చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుధ్యం మెరుగు పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ చిత్రాలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పారిశుధ్యం మెరుగు పనులపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పంచాయతీ సిబ్బంది గృహాల నుంచి చెత్తను తీసుకు వెళుతున్నారా?, వారానికి రెండు సార్లు గృహాలకు వస్తున్నారా? అని అడిగి తెలుసుకుంటారన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఉద్యోగుల పనితీరును కమిషనర్, ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. పారిశుధ్య విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాల వద్ద చెత్తను కచ్చితంగా బుట్టలోనే వేయాలన్నారు. పారిశుధ్యం మెరుగుకు వ్యాపారులు సహకరించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి పథకాలను 15 రోజులకు ఒకసారి శుభ్రంచేసి క్లోరినేషన్ చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించామన్నారు. పగటి పూట వీధి లైట్లు వెలిగి ఉంటే పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట చింతపల్లి ఎంపీడీవో సీహెచ్ సీతామహాలక్ష్మి, జీకేవీధి డిప్యూటీ ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ సమిడి గోపాల్, కార్యదర్శి లక్ష్మీకుమార్ ఉన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 11:18 PM