వేసవిలో నీటి ఎద్దడి నివారణ
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:45 AM
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించామని, పనులు అమలుచేశామని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సీఈవో) పి.నారాయణమూర్తి పేర్కొన్నారు.
రూ.20 కోట్లతో వివిధ రకాల పనులు
బోర్లు, రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పనులకు రూ.6 కోట్లు
15వ ఆర్థిక సంఘం మొదటి విడత రూ.14 కోట్లు విడుదల
రోడ్లు, డ్రైన్లు, బోర్ల మరమ్మతు వంటి 725 పనులకు కేటాయింపు
ఉన్నత పాఠశాలల ఆస్తుల పరిరక్షణకు చర్యలు
అన్ని జడ్పీ హైస్కూళ్లకు ప్రహరీ గోడలు
‘ఆంధ్రజ్యోతి’తో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి
విశాఖపట్నం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించామని, పనులు అమలుచేశామని జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సీఈవో) పి.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ, రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ, సిబ్బంది జీతాలు, బోర్లు మరమ్మతులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.ఆరు కోట్లు కేటాయించామన్నారు. సమ్మర్ క్రాష్ ప్రోగ్రామ్లో భాగంగా చేతిపంపుల (బోర్లు) మరమ్మతుకు 15వ ఆర్థిక సంఘం నిధులతో మండల పరిషత్లు విడిభాగాలు కొనుగోలు చేశాయని, చేతిపంపులు, నీటి పథకాల మరమ్మతులు పూర్తిచేశామని చెప్పారు. ఇంకా ప్రతి మండలంలో అత్యవసర పనుల కోసం విడిభాగాలు సిద్ధంగా ఉంచామన్నారు. నీటి పథకాలు, బోర్ల మరమ్మతులకు సంబంధించి ఆయా మండలాల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా అనేక గ్రామాలకు తాగునీరు అందుతున్నదని, ఇప్పటికే ఉన్న రక్షిత నీటి పథకాల నుంచి ఇంటింటికీ కొళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాని చెప్పారు.
ఆర్థిక సంఘం నిధులతో 725 పనులు
గత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలివిడత కింద 15వ ఆర్థిక సంఘం ద్వారా జడ్పీకి వచ్చిన రూ.14 కోట్లతో ఉమ్మడి జిల్లాలో రోడ్లు, డ్రైన్లు, బోర్ల మరమ్మతులు వంటి 725 పనులు మంజూరుచేయగా ఇంతవరకు 200కుపైగా పనులు పూర్తిచేసి రూ.ఆరు కోట్ల వరకు బిల్లులు చెల్లించామన్నారు. వాస్తవంగా ఈ పనులు మార్చి నెలాఖరులోగా పూర్తికావల్సి ఉందని, అయితే పలు కారణాల వల్ల కొంత జాప్యం జరిగిందని పేర్కొంటూ జూన్ నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు ఇంకా విడుదల కావల్సి ఉందన్నారు.
కాగా ఆర్థిక సంఘం నిధుల్లో ఇప్పటివరకు పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు 15 శాతం చొప్పున వచ్చేవని, అయితే తాజాగా చేసిన మార్పుల చేసిన మేరకు మండల పరిషత్లకు 20 శాతం, జడ్పీలకు 10 శాతం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రహదారులు, ఇతర పనులకు రూ.20 కోట్లు, తాగునీటి పథకాలకు రూ.10 కోట్ల వ్యయానికి పాలనాపరమైన ఆమోదం తెలిపినట్టు సీఈవో పేర్కొన్నారు. సాధారణ నిధులు రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటికి సంబంధించి ఇంతవరకు రూ.ఏడు కోట్ల విలువైన బిల్లులు సీఎంఎఫ్ఎస్కు అప్లోడ్ చేశామన్నారు.
అన్ని జడ్పీ హైస్కూళ్లకు ప్రహరీ గోడలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ ఉన్నత పాఠశాలల ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. ప్రతి పాఠశాల చుట్టూ ప్రహరీగోడ వుండాలనే నిబంధన అమలుచేశామన్నారు. ఇప్పటి వరకు ప్రహరీగోడలు లేని పాఠశాలలకు సమగ్ర శిక్ష, ఉపాధిహామీ పథకం నిధులతో గోడలు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి ఉన్నత పాఠశాల ఆస్తులకు సంబంధించి ఆయా మండల తహసీల్దార్ల నుంచి ఫెయిర్ అడంగల్ కాపీలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీపీ పాఠశాలల ఆస్తుల విషయంలో ఆయా మండల పరిషత్ అధికారులకు ఇప్పటికే సూచనలు చేశామని సీఈవో వెల్లడించారు.
Updated Date - Apr 21 , 2025 | 12:45 AM