ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:37 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
విజయవంతంగా నిర్వహించడంపై దృష్టి సారించిన వర్సిటీ ఉన్నతాధికారులు
వేడుకల నిర్వహణకు పలు కమిటీలను నియమించిన వీసీ రాజశేఖర్
ఈ నెల 26న వేడుకలు ప్రారంభం
ఏడాది పాటు నిర్వహణ
విశాఖపట్నం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 26వ తేదీ వరకు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన అతికొద్ది విశ్వవిద్యాలయాల్లో ఏయూ కూడా ఒకటి కావడంతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శతాబ్ది ఉత్సవాలకు అతిథులను ఆహ్వానించే పనిలో వర్సిటీ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే వర్సిటీ వీసీ జీపీ రాజశేఖర్ గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 26న ప్రారంభ వేడుకలను ఏయూలోని ఆయా విభాగాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే అదేరోజు ఉదయం వర్సిటీ ప్రాంగణంలో శతాబ్ది వేడుకల బెలూన్స్ను ఎగురవేయనున్నారు. అనంతరం కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ తరువాత సాగర తీరంలో సెంటినరీ వాక్థాన్ను నిర్వహిస్తారు. సాయంత్రం బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ హాల్లో శతాబ్ది ఉత్సవాలను చేపడతారు.
పలు కమిటీల నియామకం
శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీసీ రాజశేఖర్ పలు కమిటీలను ఏర్పాటు చేశారు. వేడుకలను అట్టహాసంగా నిర్వహించే బాధ్యతను ఆయా కమిటీలు చూసుకుంటాయి. ఇందులో వీసీ జీపీ రాజశేఖర్ నేతృత్వంలోని యూనివర్సిటీ లెవెల్ కోర్ కమిటీ ఒకటి. దీనికి చైర్మన్గా వీసీ వ్యవహరిస్తున్నారు. రిజిస్ర్టార్ కన్వీనర్ అండ్ మెంబర్ సెక్రటరీ కాగా, రెక్టార్తో పాటు ప్రిన్సిపాళ్లు, డీన్లు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో చైర్మన్తో సహా 14 మంది ఉన్నారు. దీనినే సెంటినరీ సెలబ్రేషన్ కమిటీగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా ఈవెంట్స్ మేనేజ్మెంట్ కమిటీ, లోగో సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఏయూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజును నియమించారు. పూర్వ విద్యార్థుల సంబంధాల కమిటీ చైర్మన్గా ఏయూ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మశ్రీ, డాక్యుమెంటేషన్ అండ్ లెగసీ చైర్మన్గా రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.కిశోర్బాబు, మీడియా రిలేషన్స్ చైర్మన్గా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.నరసింహరావు, ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్గా ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గిరిజాశంకర్ను నియమించారు. వీటితో పాటు మరికొన్ని కమిటీలను నియమించినట్టు తెలిసింది.
యాప్ల నుంచి టీచర్లకు ఉపశమనం
అందుబాటులోకి సింగిల్ యాప్ ‘లీప్’
హర్షం వ్యక్తం చేస్తున్నా ఉపాధ్యాయులు
విశాఖపట్నం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి):
బోధన కంటే యాప్ల భారం అధికంగా ఉందన్న ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో రోజువారి కార్యకాపాలకు లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) సింగిల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత ప్రభుత్వ హయాంలో టీచర్ల నెత్తిన అనేక యాప్లను పెట్టారు. పాఠశాలకు ఉదయం వచ్చిన వెంటనే స్కూల్ పరిసరాలు, మరుగుదొడ్ల శుభ్రత, మధ్యాహ్న భోజన వంటశాల వద్ద ఆహార పదార్థాల తయారీ, అనంతరం విద్యార్థులకు వడ్డన, శుభ్రత, పిల్లలు.. టీచర్ల హాజరు, నాడు-నేడు పనులు, కిట్ల వివరాలు, మార్కుల అప్డేట్ ఇలా... అనేక యాప్లతో ఉపాధ్యాయులు సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాప్ల భారాన్ని తగ్గిస్తామని ఇచ్చిన హామీ మేరకు... అన్ని పనులకు ఒకటే యాప్ కింద ‘లీప్’ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి టీచర్ తమ సెల్ ఫోన్లో ఒకేసారి యూజర్ ఐడీ, పాసువర్డుతో యాప్ ఓపెన్ చేస్తే పాఠశాలకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఈ కొత్త యాప్ ఈ నెల 16 నుంచే అందుబాటులోకి వచ్చిందని డీఈవో ఎన్.ప్రేమ్కుమార్ తెలిపారు. ఒకటే యాప్ అందుబాటులోకి రావడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 21 , 2025 | 12:37 AM