ఆయుర్వేద ఆస్పత్రుల్లో పంచకర్మ చికిత్సలు
ABN, Publish Date - May 03 , 2025 | 11:51 PM
ఆయుష్ మిషన్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పంచకర్మ చికిత్సలను అందుబాటులోకి తేనున్నది. ఇందులో భాగంగా అనకాపల్లి, కశింకోట మండలం కన్నూరుపాలెం, నర్సీపట్నంలోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో పంచకర్మ చికిత్సలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటికే ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు ఆస్పత్రిలో సేవలు
- అనకాపల్లి, కన్నూరుపాలెం, నర్సీపట్నంలో త్వరలో అందుబాటులోకి చికిత్సలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ఆయుష్ మిషన్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయుర్వేద ఆస్పత్రుల్లో పంచకర్మ చికిత్సలను అందుబాటులోకి తేనున్నది. ఇందులో భాగంగా అనకాపల్లి, కశింకోట మండలం కన్నూరుపాలెం, నర్సీపట్నంలోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో పంచకర్మ చికిత్సలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జిల్లాలో ఆయుష్ విభాగంలో 11 ఆయుర్వేద ఆస్పత్రులు, 8 హోమియో వైద్య కేంద్రాలు, నేచురల్ రూరల్ హెల్త్ మిషన్ కేంద్రాలు 7.. మొత్తం 26 ఉన్నాయి. జిల్లాలో అనకాపల్లి, కన్నూరుపాలెం, వేంపాడు, నర్సీపట్నం, ఎం.కోడూరు, కోరుప్రోలు ఆయుర్వేద ఆస్పత్రులను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)గా అభివృద్ధి చేస్తున్నారు. ఆయా ఆస్పత్రుల ఆవరణలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు ఆయుర్వేద ఆస్పత్రిలో పంచకర్మ చికిత్సలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్లవాత జబ్బులు, సైనోసైటీస్, ఆస్మా వంటి పలు రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. తాజాగా మరో మూడు ఆస్పత్రుల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. అనకాపల్లి, కశింకోట మండలం కన్నూరుపాలెం, నర్సీపట్నంలోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఆయుష్ వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కృషి చేస్తున్నామని ఆయుష్ అనకాపల్లి వైద్యాధికారి కె.లావణ్య తెలిపారు.
Updated Date - May 03 , 2025 | 11:51 PM