కారిడార్ నిర్వాసితులకు ప్యాకేజీ
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:34 AM
విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ (వీసీఐసీ) నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై రెవెన్యూ అధికారులు గురువారం మండలంలోని అమలాపురం శివారు పాటిమీద గ్రామంలో సభ నిర్వహించారు. బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్పురం, రాజయ్యపేట, వేంపాడు రెవెన్యూ గ్రామాలకు చెందిన నిర్వాసితులకు పెదబోదిగల్లం సమీపాన సుమారు 151 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో డ్రా ప్రక్రియ ద్వారా స్థలాలు కేటాయించారు.
ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల స్థలం
ఇంటి నిర్మాణానికి రూ.8.98 లక్షలు
పెదబోదిగల్లం సమీపాన 151 ఎకరాల్లో లేఅవుట్
లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు
ఇంటి నిర్మాణ సాయం రూ.25 లక్షలకు పెంచాలని వైసీపీ, సీపీఎం డిమాండ్
కలెక్టర్ దృష్టికి తీసుకెళతానన్న ఆర్డీవో
నక్కపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ (వీసీఐసీ) నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై రెవెన్యూ అధికారులు గురువారం మండలంలోని అమలాపురం శివారు పాటిమీద గ్రామంలో సభ నిర్వహించారు. బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్పురం, రాజయ్యపేట, వేంపాడు రెవెన్యూ గ్రామాలకు చెందిన నిర్వాసితులకు పెదబోదిగల్లం సమీపాన సుమారు 151 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో డ్రా ప్రక్రియ ద్వారా స్థలాలు కేటాయించారు. ఈ సభకు నిర్వాసితులతోపాటు వైసీపీ, సీపీఎం నేతలు వచ్చారు. నిర్వాసితులకు ఐదు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.8.98 లక్షల ప్యాకేజీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వైసీపీ నేత వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ తదితరులు అన్నారు. ఇంటి నిర్మాణ సాయాన్ని రూ.25 లక్షలకు పెంచాలని, అంతవరకు గ్రామాలను ఖాళీ చేసేది లేదని స్పష్టం చేశారు. నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ స్పందిస్తూ.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైసీపీ, సీపీఎం నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్ మాట్లాడుతూ, నిర్వాసితులకు ఇంటి నిర్మాణానికి ఇచ్చే ప్యాకేజీని పెంచే విధంగా హోం మంత్రి అనిత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని, ఈ విషయం ఇప్పటికే ఆమె పరిశీలనలో వుందని చెప్పారు. ఆర్డీఓ రమణ మాట్లాడుతూ, పెదబోదిగల్లంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాసితులు, నాయకుల సమక్షంలో 745 మందికి సంబంధించి ప్లాట్ల కేటాయింపునకు లాటరీ తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరిసింహమూర్తి, డీటీ నారాయణరావు, ఎంపీటీసీ సభ్యులు కుంచె మధు, కనకారావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కురందాసు నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 01 , 2025 | 12:34 AM