రైల్వేస్టేషన్ అభివృద్ధికి తొలగిన అడ్డంకులు
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:08 AM
విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం పనులకు అడ్డంకులు తొలగిపోయాయి.
కాంట్రాక్టర్ కోర్టు కేసు పరిష్కారం
కొత్త సంస్థకు బాధ్యతలు
అక్టోబరులో పనుల ప్రారంభం
2027 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
పూర్తిగా మారిన డీపీఆర్
ప్లాట్ఫారాలు 14కి పెంపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్ కోర్టు వివాదం పరిష్కారమైంది. కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించారు. అక్టోబరు నుంచి పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్కడి నుంచి 18 నెలల్లో అంటే 2027 మే నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ను పూర్తిగా అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ 2022లో నిర్ణయించింది. రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) ఈ బాధ్యత తీసుకుంది. అదే ఏడాది జూన్లో బిడ్డర్లతో సమావేశం నిర్వహించి ఏ తరహాలో అభివృద్ధి చేయాలనుకుంటున్నదీ వివరించింది. ఆగస్టులో రూ.456 కోట్లతో బిడ్డింగ్ ఖరారు చేసింది. నవంబరు రెండో తేదీన ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. 36 నెలల్లో పూర్తిచేయాలనేది ఒప్పందం. అంటే అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది నవంబరుకు ఈ ప్రాజెక్టు పూర్తి కావలసి ఉంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కనస్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఈ కాంట్రాక్టును ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్కు, ఆర్ఎల్డీఏకు మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. పనులు ఆగిపోయాయి.
కొత్త డీపీఆర్ తయారీ
ముంబై నుంచి బదిలీపై వచ్చి ఇక్కడ డీఆర్ఎంగా పనిచేస్తూ రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన సౌరభ్ ప్రసాద్ ఈ కోర్టు కేసు పరిష్కారానికి కృషిచేశారు. ఆ ఫలితంగా అది కొలిక్కి వచ్చి కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పుడు అనుకున్న ప్రకారం కాకుండా ఇంకా అనేక అదనపు పనులు జోడించి కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేశారు. ప్రస్తుతం ఎనిమిది ప్లాట్ఫారాలు ఉండగా వాటిని ఇంకో రెండు పెంచి పది చేయాలని అనుకున్నారు. వాటి కోసం జ్ఞానాపురం వైపు చెట్లను తొలగించి పనులు కూడా చేపట్టారు. అయితే కొత్త డీపీఆర్లో ఇంకో నాలుగు ప్లాట్ఫారాలు పెంచి మొత్తం 14 చేయాలని నిర్ణయించారు. మరికొన్ని అదనపు పనులు కూడా చేర్చారు. ఈ డీపీఆర్ను ఢిల్లీకి పంపించారు. దానికి ఆమోదం లభించాల్సి ఉంది. అక్కడ అంగీకారం లభించగానే అక్టోబరులో పనులు ప్రారంభించి, అక్కడి నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2027 మేకు పూర్తి
శ్రీభరత్, విశాఖ ఎంపీ
రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు 2027 మే నాటికి పూర్తయిపోతాయని విశ్వాసం ఉంది. ఇప్పుడు మంచి సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. డీపీఆర్ ఆమోదించగానే పనులు మొదలవుతాయి. చాలా వేగంగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
Updated Date - Jun 08 , 2025 | 01:08 AM