ఏయూ అధికారుల నిర్లక్ష్యం
ABN, Publish Date - Apr 22 , 2025 | 01:22 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.
నాలుగో సెమిస్టర్ పరీక్ష పత్రంలో మూడో సెమిస్టర్కు సంబంధించిన ప్రశ్నలు
ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థులు..
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షల నిర్వహణలో ప్రతిసారి ఏదో ఒక తప్పు చేయడం ఈ విభాగానికి పరిపాటిగా మారింది. తాజాగా జరుగుతున్న పీజీ పరీక్షల్లోనూ మరోసారి ఏయూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నెల 19 నుంచి పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ర్టీ చదువుతున్న విద్యార్థులకు నాలుగో సెమిస్టర్కు సంబంధించి ‘ఆర్గానిక్ స్పెక్ర్టోస్కోపీ అండ్ స్ట్రక్చర్ డెటర్మినేషన్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్’ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి సిలబస్గా ఐదు యూనిట్లు ఉన్నాయి. అయితే, అందులో రెండు యూనిట్లకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే నాలుగో సెమిస్టర్ సిలబస్ నుంచి ఇచ్చారు. మిగిలిన మూడు యూనిట్లు కూడా మూడో సెమిస్టర్కు సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు షాక్ తిన్నారు. ఈ విషయం విద్యార్థులు గుర్తించి ఇన్విజిలేటర్లకు తెలియజేశారు. పలు కాలేజీల్లోని ఇన్విజిలేటర్లు...ఏయూ అధికారులకు తెలియజేశారు. అయితే, పరీక్షను యథావిధిగా కొనసాగించాలని చెప్పారు. పరీక్షల విభాగం నిర్లక్ష్యం వల్ల సుమారు వేయి మందికిపైగా విద్యార్థులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు ఈ సెక్షన్పై దృష్టిసారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటే తప్ప తప్పులకు బ్రేక్ పడేలా లేదంటున్నారు.
ముంబై పర్యటనకు వీఎంఆర్డీఏ కమిషనర్
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ముంబై బయలుదేరి వెళ్లారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమలు చేస్తున్న విధానాలు, చేపట్టిన ప్రాజెక్టులను ఆయన అధ్యయనం చేయనున్నారు. ఇన్చార్జి కమిషనర్గా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్కు బాధ్యతలు అప్పగించారు.
25వ తేదీన డీఆర్సీ
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష (డీఆర్సీ) సమావేశం ఈనెల 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరగనున్నది. జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఎ సహా విద్య, వైద్యం, పర్యాటకం తదితర 11 శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు.
డిప్యూటేషన్ టీచర్లు వెనక్కి...
విశాఖపట్నం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో పని సర్దుబాటుపై ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయులు వెనక్కి రావాలని విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకూ పనిచేసే పాఠశాలల నుంచి మంగళవారం రిలీవ్ అయి బుధవారం ఒరిజినల్ పోస్టింగ్ పొందిన పాఠశాలలో రిపోర్టు చేయాలన్నారు.
Updated Date - Apr 22 , 2025 | 01:22 AM