వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:35 PM
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని మాతాశిశు మరణాలు, నియంత్రణ చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి.విశ్వేశ్వరనాయుడుతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ ఏఎన్ దినేశ్కుమార్ హెచ్చరిక
మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచన
పాడేరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని మాతాశిశు మరణాలు, నియంత్రణ చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి.విశ్వేశ్వరనాయుడుతో కలిసి బుధవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి మాతా శిశు మరణంపై కారణాలను వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అటువంటి మరణాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, అలాగే మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. వాటిని టాంపరింగ్ చేస్తే అందుకు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఏదైనా కారణాలతో వైద్యులు అందుబాటులో లేకపోతే హెల్త్ సూపర్వైజర్, తదితరులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో హైరిస్క్ గర్భిణులను సకాలంలో 108 లేదా పీహెచ్సీ అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సకాలంలో అంబులెన్సులు అందుబాటులో లేకుంటే వెంటనే హెల్త్ కాల్ సెంటర్: 6303921374 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. పీహెచ్సీల్లోని వైద్యులు ఓపీకే పరిమితం కాకుండా పారామెడికల్ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ల పనితీరు బాగోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మదర్, చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు కీలకమని, వాటిని సక్రమంగా నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణుల ట్రాకింగ్ సక్రమంగా జరగడం లేదని, మదర్, చైల్డ్ ప్రొటెక్షన్ కార్డుల నిర్వహణపై ఆశా కార్యకర్త స్థాయి నుంచి వైద్యాధికారి వరకు అందరూ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. అత్యవసర రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని డీఎంహెచ్వోకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టి.విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి హెచ్వోడీ టి.నరసింగరావు, గైనకాలజిస్టులు డాక్టర్ సృజన, డాక్టర్ శోభారాణి, డాక్టర్ వాసవి, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 11:35 PM