ప్రశాంతంగా నీట్
ABN, Publish Date - May 05 , 2025 | 12:27 AM
వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్) తత్సమాన ప్రవేశాలకు జాతీయ స్థాయి ‘నీట్’ పరీక్ష ఆదివారం విశాఖలోని 16 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది.
97.75 శాతం మంది హాజరు
కేంద్రాలకు ముందుగానే చేరుకున్న అభ్యర్థులు
క్షుణ్నంగా తనిఖీ చేసిన సిబ్బంది
పర్యవేక్షించిన ఆర్డీవోలు, తహసీల్దార్లు
విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):
వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్) తత్సమాన ప్రవేశాలకు జాతీయ స్థాయి ‘నీట్’ పరీక్ష ఆదివారం విశాఖలోని 16 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 7,344 మంది అభ్యర్థులకు గాను 7,179 మంది (97.75 శాతం) హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారు. నగరంలోని వీఎస్ కృష్ణా కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఏయూ ఇంజనీరింగ్, ఆర్ట్స్, ఎంబీఏ కళాశాలలు, కంచరపాలెంలోని రెండు పాలిటెక్నిక్ కళాశాలలు, కేంద్రీయ విద్యాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షకు మల్కాపురం కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ను సిటీ కో ఆర్డినేటర్గా నియమించారు. జాతీయస్థాయి పరీక్ష కావడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కో ఆర్డినేటింగ్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కో ఆర్డినేటింగ్ సూపర్వైజర్గా డీఆర్వో బీహెచ్ భవానీశంకర్ వ్యవహరించారు. ప్రతి ఎనిమిది సెంటర్లకు ఒకరు చొప్పున ఇద్దరు ఆర్డీవోలు, ప్రతి రెండు కేంద్రాలను ఒక తహసీల్దారు పర్యవేక్షించారు. అభ్యర్థుల వెంట తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకున్నారు.
సహకరించిన వాతావరణం
నగరంలో ఆదివారం మేఘాలు ఆవరించి చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లగా మారింది. దీంతో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు, కేంద్రాల బయట నిరీక్షించిన వారికి ఇబ్బందులు ఎదురుకాలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు ఉదయం 11 గంటల తరువాత అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు అనుమతించిన నిర్వాహకులు, ప్రధాన గేటు వద్ద ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. ఎలకా్ట్రనిక్ వాచీలు, ఇతర వస్తువులు అనుమతించలేదు. బాలికలకు చెవిదుద్దులు, ముక్కపుడకలు తొలగించిన తరువాతే లోపలకు పంపారు. కృష్ణాకళాశాల వద్ద ఒక బాలిక ముక్కుపుడక రాకపోయినా అనుమతించారు. ఇదే కేంద్రంలో చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులను పోలీసులు తమ వాహనాలపై కేంద్రానికి తరలించారు.
Updated Date - May 05 , 2025 | 12:27 AM