దంపతుల హత్య
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:09 AM
నగరంలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు.
దువ్వాడ ప్రాంతంలో దారుణం
24 గంటల తరువాత వెలుగులోకి...
కూర్మన్నపాలెం (విశాఖపట్నం), ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ నేవల్ డాక్యార్డు ఉద్యోగి గంపల యోగీంద్రబాబు (66), ఆయన భార్య లక్ష్మి (52) గత 30 ఏళ్లుగా జీవీఎంసీ 86వ వార్డు రాజీవ్ నగర్లో నివాసముంటున్నారు. ఐదు రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లారు. రెండు రోజుల క్రితం తిరిగివచ్చారు. శుక్రవారం సాయంత్రం యోగీంద్రబాబు ఇంటికి ఆయన మేనల్లుడు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. ఇరువురికీ ఫోన్ చేస్తే ఇంట్లో రింగ్ అవుతుండడంతో అనుమానం వచ్చి కిటికీ తలుపులు తీసి చూడగా...రక్తపు మడుగులో యోగీంద్రబాబు కనిపించారు. దాంతో వెంటనే 100కి ఫోన్ చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళం బద్ధలు కొట్టించారు. లోపలకు వెళ్లి చూస్తే హాల్లో యోగీంద్రబాబు, మరో రూమ్లో లక్ష్మి రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉన్నారు. వారిని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బంగారం, నగదు కోసం కోసం ఎవరైనా హత్య చేశారా?, అనే కోణంలో పరిశీలిస్తున్నారు. హత్య జరిగి 24 గంటలు అయి ఉంటుందని (బహుశా గురువారం రాత్రి) పోలీసులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యోగీంద్రబాబు, విశాఖ రామకృష్ణాపురానికి చెందిన లక్ష్మి ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు (సుజిత్, శిల్ప) ఉన్నారు. ఇరువురూ అమెరికాలో ఉన్నారు. లక్ష్మి ప్రస్తుతం స్థానిక గ్లోరియా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు తెలిపారు.
Updated Date - Apr 26 , 2025 | 01:09 AM