జీవీఎంసీ కమిషనర్గా కేతన్గార్గ్
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:20 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్గా కేతన్గార్గ్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
రేపు బాధ్యతలు స్వీకరించే అవకాశం
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్గా కేతన్గార్గ్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఐదు నెలల తర్వాత జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించినట్టయింది. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కేతన్గార్గ్ శిక్షణ అనంతరం విజయనగరం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్గా దాదాపు ఏడాదిపాటు పనిచేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్గా, అనంతపురం జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత మూడు నెలలు పాటు అదేజిల్లాలో జిల్లాపరిషత్ సీఈవోగా పనిచేశారు. గత ఏడాది జూలై నుంచి రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ప్రస్తుతం నగరంలోనే ఉన్న కేతన్గార్గ్ బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
31 రోజుల్లో రూ.3.21 కోట్లు
అప్పన్నకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
సింహాచలం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామికి గడచిన 31 రోజుల్లో హుండీల ద్వారా రికార్డు స్థాయిలో సుమారు రూ.3.21 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో సోమవారం సింహగిరిపై పరకామణిలో హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ.3,21,38,717 లభించినట్టు అధికారులు వెల్లడించారు. హుండీల ద్వారా ఇంత పెద్ద మొత్తం లభించడం దేవాలయ చరిత్రలో ఇదే తొలిసారి. నగదుతో పాటు 203 గ్రాముల బంగారం, 18.25 కిలోల వెండి, 231 యుఎస్ డాలర్లు, 185 ధీరమ్స్, కెనడాకు చెందిన 15 డాలర్లు, సింగపూర్ డాలర్లు 12, సౌదీ, ఒమన్, శ్రీలంక, మలేషియా, టర్కీ తదితర దేశాల కరెన్సీ కూడా అప్పన్న ఖజానాకు సమకూరింది. హుండీల లెక్కింపులో దేవస్థానం వివిధ విభాగాలకు చెందిన ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 01:20 AM