మరీ ఇంత నిర్లక్ష్యమా?
ABN, Publish Date - Jul 16 , 2025 | 11:32 PM
విద్యా రంగంలో సంస్కరణలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ పరుగులు పెట్టిస్తుంటే జిల్లాలోని విద్యాశాఖలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతానికి భిన్నంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలు, టీచర్ల బోధన, అభ్యాసన కరదీపికలను ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే ముద్రించి వారికి అందిస్తున్నది.
పాఠశాలలు పునఃప్రారంభమై నెలవుతున్నా పంపిణీ కాని టీచర్స్ హ్యాండ్ బుక్స్
వాటి కోసం ఎదురు చూస్తున్న టీచర్లు
జిల్లా కేంద్రానికి వచ్చి నెలన్నర కావస్తున్నా ఉపాధ్యాయులకు పంపిణీ చేయని విద్యాశాఖాధికారులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
విద్యా రంగంలో సంస్కరణలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ పరుగులు పెట్టిస్తుంటే జిల్లాలోని విద్యాశాఖలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. గతానికి భిన్నంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికలు, టీచర్ల బోధన, అభ్యాసన కరదీపికలను ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే ముద్రించి వారికి అందిస్తున్నది. అయితే జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్షం కారణంగా నెలన్నర క్రితమే జిల్లాకు ఆయా పుస్తకాలు వచ్చినప్పటికీ నేటి వాటిని ఉపాధ్యాయులకు అందించలేదు. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమై నెల దాటినప్పటికీ వాటిని తమకు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీచర్లు అంటున్నారు.
పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వివిధ సబ్జెక్టుల బోధనకు, టీచర్లకు సంబంధించిన కరదీపికలను ఈ ఏడాది నుంచి ప్రభుత్వమే టీచర్లకు అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా టీచర్లకు అవసరమైన ఆయా కరదీపికలను నెలన్నర క్రితమే జిల్లా కేంద్రానికి పంపిణీ చేశారు. అయితే వాటిని జిల్లా కేంద్రం నుంచి మండల విద్యాశాఖాధికారికి, అక్కడి నుంచి స్కూల్ కాంప్లెక్స్ల ద్వారా ఉపాధ్యాయులకు అందించాల్సి ఉంది. కానీ ఎందుచేతనో వాటిని జిల్లా కేంద్రం నుంచి కనీసం మండల కేంద్రాలకు పంపిణీ చేయలేదు. దీంతో సుమారు నెలన్నరగా స్థానిక డీఈవో కార్యాలయం ఆవరణలోనే గుట్టలుగా ఆయా పుస్తకాలున్నాయి.
కరదీపికల కోసం ఉపాధ్యాయుల ఎదురు చూపులు
గతంలో టీచర్లు వినియోగించే పాఠ్య ప్రణాళికలకు సంబంధించిన(కరదీపికలు) పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేసేది కాదు. దీంతో ఉపాధ్యాయులు వాటిని కొనుగోలు చేసుకుని వినియోగించుకునే వారు. అందుకు భిన్నంగా ఈ ఏడాది నుంచి టీచర్లకు అవసరమైన హ్యాండ్ బుక్లు, పాఠ్యప్రణాళికల పుస్తకాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని నిర్ణయించింది. దీంతో వాటి కోసం గత నెల రోజులుగా పాఠశాలల ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. మారిన విధానం నేపథ్యంలో బయట లభించే పుస్తకాలను కొనుగోలు చేసి రాసుకోలేని పరిస్థితి. పాఠశాలలు పునఃప్రారంభమై నెలవుతున్నా ప్రభుత్వం సరఫరా చేసిన పుస్తకాలు అందకపోవడంతో టీచర్లు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. వాస్తవానికి వాటిని పాఠశాలల పునఃప్రారంభం నాటికే టీచర్లకు అందించాల్సి ఉండగా, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. విద్యారంగంలో మార్పులకు అనుగుణంగా అధికారులు చురుగ్గా వ్యవహరించకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా పుస్తకాలను తమకు అందించాలని పలువురు టీచర్లు కోరుతున్నారు.
Updated Date - Jul 16 , 2025 | 11:32 PM