రైతులకు సాగునీటి కష్టాలు
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:04 PM
మండలంలోని కినపర్తి పంచాయతీ చుట్టుబంధ సమీపంలో గల తొణుకులు గెడ్డ రిజర్వాయర్ స్లూయిస్తో పాటు మదుము గేట్లు మరమ్మతులకు గురై నాలుగేళ్లు అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు.
మరమ్మతులకు గురైన తొణుకులు గెడ్డ రిజర్వాయర్ స్లూయిస్
మదుము గేట్లు కూడా..
నాలుగేళ్లుగా పట్టించుకోని అధికారులు
200 ఎకరాలకు నీరు అందక ఎండిపోతున్న పరిస్థితి
కొయ్యూరు, జూలై 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని కినపర్తి పంచాయతీ చుట్టుబంధ సమీపంలో గల తొణుకులు గెడ్డ రిజర్వాయర్ స్లూయిస్తో పాటు మదుము గేట్లు మరమ్మతులకు గురై నాలుగేళ్లు అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీరు వృథా అవుతోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. దీని ఆయకట్టు కింది భూములకు సాగునీరందక సుమారు 200 ఎకరాలు బీడు భూములుగా మారుతున్నాయి.
తొణుకుల గెడ్డ రిజర్వాయర్ కింద వలసంపేట, భీమవరం, చుట్టుబంధ, రిట్టమానుపాలెం గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాలకు గతంలో రెండు పంటలకు సరిపడా సాగునీరు పుష్కలంగా అందేది. ఈ రిజర్వాయర్కు కినపర్తి సమీపంలో గల చెక్డ్యామ్ మిగులు నీరుతో పాటు తొణుకుల గెడ్డ ప్రవాహ నీరు చేరేది. ఈ రిజర్వాయర్ను 1958లో నిర్మించారు. కాగా నాలుగు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు రిజర్వాయర్ స్లూయిస్తో పాటు కుడి, ఎడమ కాలువలకు నీరు వెళ్లే గేట్లు మరమ్మతులకు గురికావడంతో పాటు మదుము శిఽథిలమై కుడి కాలువ గండి పడడం, ఎడమ కాలువ పూర్తిగా పూడుకుపోవడంతో సాగునీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. అలాగే అతివృష్టి సమయాల్లో ప్రవాహ ఉధృతికి ఆయకట్టు కింద ఉన్న పంటలు నీటమునగడం, ఇసుక మేటలు వేయడం జరుగుతోంది. అనావృష్టి సమయాల్లో సాగునీరందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. ఈ రిజర్వాయర్ సక్రమంగా వినియోగంలో ఉన్నప్పుడు ఖరీఫ్లో వరి సాగుతో పాటు రబీలో మినప, వంగ, ప్రత్తి, టమాటా వంటి పంటలను రైతులు వేసేవారు. మండు వేసవిలో సైతం ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే నాలుగేళ్లుగా స్లూయిస్ మరమ్మతుల కారణంగా సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయకట్టు రైతులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని ఆయకట్టు రైతులు రుత్తల రామకృష్ణ, మల్లేశ్వరావు, గోవిందు, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధికారులు స్పందించి స్లూయిస్కు మరమ్మతులు చేయించడంతో పాటు కుడి, ఎడమ కాలువల్లో పూడిక తీసి గట్లు పటిష్ఠం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఎస్ఎంఐ జేఈ రామకృష్ణ వివరణ కోరగా, రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు రూ.20 లక్షల నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం నీరు ఉండడంతో సీజన్ అనంతరం మరమ్మతులు చేపడతామని చెప్పారు.
Updated Date - Jul 20 , 2025 | 11:04 PM