ముమ్మరంగా వాహన తనిఖీలు
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:58 AM
జిల్లాలో సోమవారం వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సోమవారం నుంచి మొదలుకావడంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టు అమరుల వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్బర్ధార్ సూచన
3 వరకు ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు
పాడేరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సోమవారం నుంచి మొదలుకావడంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు తమ ఉనికి కోసం ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా కట్టడి చేయాలనే లక్ష్యంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే అనుమానితులపైనా పోలీసులు నిఘా పెట్టారు. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లోని పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అమిత్బర్ధార్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని ప్రజలకు సూచించారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల కేంద్రం నుంచి జోలాపుట్టు, సంగడ, పెదబయలు, కుమడ, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులపై అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించి విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. సోమవారం నుంచి సీపీఐ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిపై సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ పోలీసులు బలగాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించి, ఇటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను, ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అలాగే ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసులు వాహన తనిఖీలను నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామాల మీదుగా ఆంధ్రా, ఒడిశాకు చెందిన పోలీసు బలగాలు ముమ్మర గాలింపులు చేపడుతున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు ఎవరూ ఆశ్రయం కల్పించరాదని, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
3 వరకు ఆర్టీసీ నైట్ సర్వీసులు రద్దు
సీలేరు: సీలేరు మీదుగా నడిచే ఆర్టీసీ నైట్ సర్వీసులను సోమవారం నుంచి వారం రోజుల పాటు రద్దు చేసినట్టు విశాఖపట్నం డిపో అధికారులు తెలిపారు. ఏవోబీలో సీపీఐ మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే నైట్ సర్వీసు, భద్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే నైట్ సర్వీసు, విశాఖపట్నం- సీలేరు నైట్ హాల్ట్, పాడేరు- భద్రాచలం నైట్ సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. పగటి వేళ తిరిగే సర్వీసులను యఽథావిధిగా నడుపుతున్నట్టు తెలిపారు.
Updated Date - Jul 29 , 2025 | 12:58 AM