యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
ABN, Publish Date - May 21 , 2025 | 11:42 PM
కొయ్యూరు- వై.రామవరం మండలాల సరిహద్దుల్లో గల బొడ్డేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీని వల్ల ప్రమాదకర గోతులు ఏర్పడడంతో పాటు రెండు మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల గిరిజనులకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
బొడ్డేరు వాగులో ఎక్స్కవేటర్లతో తవ్వి తరలింపు
ట్రాక్టరు ఇసుక రూ.4 వేలు చొప్పున విక్రయం
20 గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు
చోద్యం చూస్తున్న అధికారులు
కొయ్యూరు, మే 21(ఆంధ్రజ్యోతి) కొయ్యూరు- వై.రామవరం మండలాల సరిహద్దుల్లో గల బొడ్డేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీని వల్ల ప్రమాదకర గోతులు ఏర్పడడంతో పాటు రెండు మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల గిరిజనులకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
మండలంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. బొడ్డేరు వాగులో ఇసుకను అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు. ట్రాక్టరు ఇసుక రూ.4 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ఎక్స్కవేటర్లతో వాగులో లోతుగా తవ్వకాలు జరపడంతో ప్రమాదకర గోతులు ఏర్పడుతున్నాయి. స్థానిక సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు దీనిని గుర్తించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానా లకు తావిస్తోంది. ఇటీవల వై.రామవరం తహసీల్దార్ స్వయంగా బొడ్డేరు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఎక్స్కవేటర్లు లేవని వెనుదిరిగారు తప్పితే నిల్వ చేసిన ఇసుక గురించి ఆరా తీయలేదు. దీంతో అక్రమార్కులు రాత్రి వేళలో ఇసుకను దర్జాగా తరలించేశారు. కొయ్యూరు, వై.రామవరం మండలాల పరిధిలో ఇసుక రీచ్లు లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ఇసుక కోసం బండి గెడ్డ, బొడ్డేరు వాగులపైనే ఆధారపడతారు. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఈ రెండు చోట్ల ఇసుక పుష్కలంగా లభిస్తోంది. అయితే ఈ ప్రాంతవాసులకు ఇసుక దక్కకుండా అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వి తరలించేస్తున్నారు. దీని వల్ల ఇళ్ల నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - May 21 , 2025 | 11:42 PM