ప్రమాదాలకు హైవే
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:38 AM
నగర పరిధిలోని చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారి పార్కింగ్ స్థలంగా మారిపోయింది.
ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
జాతీయ రహదారిపైనే ట్రావెల్స్ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు నిలిపివేత
ఆ కారణంగానే తరచూ ప్రమాదాలు
వారం వ్యవధిలో ముగ్గురి మృతి
అయినా పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగర పరిధిలోని చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారి పార్కింగ్ స్థలంగా మారిపోయింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, లారీలతో పాటు నగరవాసులకు చెందిన కార్లు, ఇతర వాహనాలను సైతం హైవేపైనే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో తరచూ హైవేపై రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు.
నగరం మధ్య నుంచి వెళుతున్న జాతీయ రహదారిపై నిరంతరం అనేక రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాల రద్దీ కారణంగా ఎక్కడో ఒకచోట ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ప్రధానంగా హనుమంతవాక కూడలి నుంచి అక్కయ్యపాలెం జంక్షన్ వరకూ అయితే వాహనాల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. అంతటి రద్దీగా ఉండే జాతీయ రహదారిని కొందరు వాహనాల పార్కింగ్కు అనువైన స్థలంగా భావిస్తున్నారు. మద్దిలపాలెం జంక్షన్ నుంచి గురుద్వారా వరకూ ఉదయం ఎనిమిది గంటల సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను పార్కింగ్ చేస్తున్నారు. రోడ్డుపైనే బస్సులను, సీట్ కవర్లను శుభ్రం చేసుకుంటుంటా. వీటితోపాటు హైవే పక్కన ఉండే ఇళ్లలో నివాసం ఉండేవారు, కార్యాలయాల్లో పనిచేసేవారు తమ వాహనాలను జాతీయ రహదారిపైనే పార్కింగ్ చేస్తున్నారు. రద్దీ సమయాలతో పాటు రాత్రివేళ జాతీయ రహదారిపై వాహనాల పార్కింగ్ కారణంగా ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ముందు వెళ్లే వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే సత్యం జంక్షన్ నుంచి గురుద్వారా వచ్చే మార్గంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతిచెందగా, ఇసుకతోట సిగ్నల్ సమీపంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గురుద్వారా జంక్షన్ నుంచి హనుమంతవాక కూడలి వరకు జాతీయ రహదారిపై వాహనాల పార్కింగ్ నిత్యకృత్యంగా మారింది. వీటివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హైవేపై వాహనాల పార్కింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ట్రావెల్స్ నిర్వాహకులు, ఇతర వాహనాల యజమానులతో పోలీసులు అవగాహన కుదుర్చుకోవడం వల్లే వారు హైవేపై దర్జాగా పార్కింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారిపై పార్కింగ్లో ఉన్న వాహనాలను టోయింగ్ వెహికల్స్ ద్వారా స్టేషన్కు తరలించడం, అయినప్పటికీ ఎవరైనా పార్కింగ్ చేస్తే వాటికి జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకుంటే హైవేపై పార్కింగ్కు అడ్డుకట్ట పడడంతోపాటు ప్రమాదాలకు కూడా అవకాశం ఉండదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:39 AM