మన్యంలో భారీ వర్షం
ABN, Publish Date - May 14 , 2025 | 11:28 PM
మన్యంలో బుధవారం భారీ వర్షం కురిసింది. అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ మారుమూల కుంభర్తి గ్రామంలో పిడుగుపాటుకు ఐదు మేకలు మృతి చెందాయి. చింతపల్లిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, జీకేవీధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
అనంతగిరి మండలంలో పిడుగుపాటుకు 5 మేకలు మృతి
చింతపల్లి, జీకేవీధిలో కుండపోత
పాడేరు, మే 14(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం భారీ వర్షం కురిసింది. అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ మారుమూల కుంభర్తి గ్రామంలో పిడుగుపాటుకు ఐదు మేకలు మృతి చెందాయి. చింతపల్లిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు, జీకేవీధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం కురిసినా గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు. కొయ్యూరులో 37.3, పాడేరులో 35.9, జీకేవీధిలో 34.4, డుంబ్రిగుడలో 34.0, చింతపల్లిలో 33.0, అరకులోయలో 32.8, జి.మాడుగులలో 32.0, అనంతగిరిలో 31.9, పెదబయలు, హుకుంపేటలో 31.8, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు చిత్తడిగా మారాయి. వర్షం వల్ల వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. మండలంలోని లంగుపర్తి పంచాయతీ మారుమూల కుంభర్తి గ్రామంలో పిడుగుపాటుకు జన్ని సింహద్రి, సివేరి బాలకృష్ణకు చెందిన 5 మేకలు మృతి చెందాయి.
చింతపల్లిలో...
చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. వర్షానికి స్థానిక వారపు సంతల్లో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
జీకేవీధిలో...
గూడెంకొత్తవీధి: మండలంలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ప్రధానంగా జీకేవీధి, రింతాడ, అసరాడ, ఆర్వీనగర్, పెదవలస ప్రాంతాల్లో అధిక వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Updated Date - May 14 , 2025 | 11:28 PM