ఫెర్టిలిటీ సెంటర్లపై ఆరోగ్య శాఖ కన్ను
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:58 AM
తెలుగు రాష్ట్రాల్లో ‘సృష్టి’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఫెర్టిలిటీ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
‘సృష్టి’ వ్యవహారంతో అప్రమత్తమైన అధికారులు
నిరంతరం తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం
మూడు కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసిన డీఎంహెచ్వో
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):
తెలుగు రాష్ట్రాల్లో ‘సృష్టి’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత ఫెర్టిలిటీ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ‘సృష్టి’ మూలాలు నగరంలో కూడా ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తనిఖీలు చేసిన పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించడంతోపాటు మేనేజర్గా పనిచేస్తున్న మహిళను అరెస్టు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ 2018లో అనుమతి తీసుకుంది. 2023 నుంచి రెన్యువల్ చేయించుకోలేదు. అయినప్పటికీ ఇక్కడ అనధికారికంగా కార్యకలాపాలు నిర్వహించినట్టు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని అఽధికారులు నిర్ణయించారు. జిల్లాలో ఉన్న 50 ఫెర్టిలిటీ సెంటర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆదేశించారు. ఈ బాధ్యతలను ‘డెమో’ నాగేశ్వరరావు, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్కు అప్పగించారు. వీరిద్దరితో కూడిన అధికారుల బృందం ఆయా కేంద్రాలను తనిఖీలు చేయనున్నది. వారంలో ఒకటి, రెండుసార్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కూడా స్వయంగా కొన్ని కేంద్రాలను తనిఖీ చేయాలని నిర్ణయించారు. మంగళవారం జిల్లాలోని మూడు ఐవీఎఫ్ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. ఇందులో ఒయాసిస్, పద్మశ్రీ ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. ఐవీఎఫ్ సెంటర్లలో జరుగుతున్న ప్రక్రియకు సంబంధించిన పూర్తి డేటా అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. అలాగే, సరోగసీ నిర్వహించే కేంద్రాలను మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని కమిటీ సభ్యులకు సూచనలు చేశారు. జిల్లాలోని ఫెర్టిలిటీ సెంటర్లు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని, లైసెన్సులు రద్దు చేయడంతోపాటు ఇతర న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు హెచ్చరించారు.
Updated Date - Jul 30 , 2025 | 12:58 AM