28న జీవీఎంసీ మేయర్ ఎన్నిక
ABN, Publish Date - Apr 23 , 2025 | 01:20 AM
జీవీఎంసీ మేయర్ ఎన్నికను ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ జారీచేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ మేయర్ ఎన్నికను ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ మేయర్గా ఉన్న గొలగాని హరివెంకటకుమారి ఈనెల 19న పదవీచ్యుతులయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ఈనెల 28న కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేయర్ ఎన్నిక నోటిఫికేషన్తోపాటు తేదీ, సమయం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫారం-11 ప్రకారం సమాచారాన్ని కౌన్సిల్ సభ్యులతోపాటు ఎక్స్-అఫిషీయో సభ్యులందరికీ ఈనెల 24లోపు అందజేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించించారు. 28న ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇదిలావుండగా తాజా మాజీ మేయర్ హరివెంకటకుమారికి కార్యాలయం కేటాయింపును రద్దు చేస్తూ రాష్ట్ర మునిసిపల్శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
వీఎంఆర్డీఏ డీఎఫ్ఓ పోస్టు కోసం పైరవీలు
ఆరోపణలు కలిగిన ఓ అధికారి యత్నాలు
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) అర్బన్ డీఎఫ్ఓగా రావడానికి ఆరోపణలు కలిగిన ఒక అధికారి యత్నిస్తున్నారు. ఇక్కడి డీఎఫ్ఓ శాంతిస్వరూప్ డిప్యుటేషన్ కాలం ముగియడంతో నాలుగు నెలల క్రితం మాతృశాఖకు వెళ్లిపోయారు. దాంతో అదే విభాగంలో రేంజర్గా పనిచేస్తున్న సుజాత శివానీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెండు నెలల క్రితం సోమసుందరం అనే అధికారి డీఎఫ్ఓగా రాగా ఆయన్ను విధుల్లో చేర్చుకున్నారు. అయితే తాను వేరే అధికారిని సిఫారసు చేశానని, విధులు నిర్వహించడానికి వీల్లేదని ఓ ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఆయన ఆ మరుసటిరోజే వెనక్కి వెళ్లిపోయారు. దాంతో ఆ పోస్టు ఖాళీగానే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లాలో అసిస్టెంట్ కన్సర్వేటర్గా పనిచేస్తున్న ఒకరు పెద్దల సిఫారసుతో ఇక్కడికి రావడానికి యత్నిస్తున్నారు. ఆయనపై గతంలో అనేక కేసులు ఉన్నాయని సమాచారం. అలాగే అటవీ భూమి పరాధీనం కావడానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.వీఎంఆర్డీఏకు అలాంటి అవినీతి అధికారులను ఎలా కేటాయిస్తారని ఇక్కడి పాలకులు ప్రశ్నిస్తున్నారు.
26 నుంచి ఏయూ శతాబ్ది వేడుకలు ప్రారంభం
అదేరోజు ఉదయం బీచ్రోడ్డులో భారీ వాక్థాన్
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సంబంధించి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మంగళవారం సెనేట్ హాల్లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వర్సిటీలోని వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్, హాస్టళ్ల వార్డెన్లు హాజరయ్యారు. ఈ నెల 26 నుంచి శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలను ఎలా నిర్వహించాలన్న ఈ సమావేశంలో చర్చించారు. 26న ఉదయం బీచ్రోడ్డులో భారీ వాక్థాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వాక్థాన్లో వర్సిటీలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులతోపాటు బయట విద్యా సంస్థల నుంచి విద్యార్థులు భారీగా హాజరయ్యేలా చూడాలని వీసీ సూచించినట్టు తెలిసింది. వీటితోపాటు ఇతర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు.
వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజు
విశాఖపట్నం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కేకే రాజును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన 2019, 2024 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. కాగా ఇంతవరకూ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది. కేకే రాజు నియామకం పట్ల పార్టీనేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - Apr 23 , 2025 | 01:20 AM