జీవీఎంసీ ఆస్తులకు ఎసరు
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:58 AM
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు జీవీఎంసీకి చెందిన స్థలాలు, ఓపెన్ స్పేస్ల మార్పిడి వెనుక కీలకంగా వ్యవహరిస్తున్నారు.
పార్కులు, ఓపెన్స్పేస్లు అన్యాక్రాంతం
ప్రజా ప్రతినిధులు, నేతల సిఫార్సులతోనే...
జీవీఎంసీ స్థలాలు అన్యాక్రాంతం
అధికారంలో ఉన్న వారితో ప్రైవేటు వ్యక్తుల ఒప్పందాలు
వైసీపీ హయాంలో బీజం
కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్న వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు జీవీఎంసీకి చెందిన స్థలాలు, ఓపెన్ స్పేస్ల మార్పిడి వెనుక కీలకంగా వ్యవహరిస్తున్నారు. మధురవాడ ఎంఎస్ఆర్ లేఅవుట్లోని పార్కు స్థలం, కోటనరవలోని ఓపెన్స్పేస్ ప్రైవేటు వ్యక్తులకు బదలాయింపు నాడు, నేడు కూడా అధికారంలో ఉన్న నాయకులే చక్రం తిప్పారు. వాటి కోసం కొందరు వైసీపీ హయాంలో ప్రయత్నాలు ప్రారంభిస్తే కూటమి హయాంలో పూర్తికావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కొందరు నాయకులు ప్రజా సంక్షేమం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తుంటారు. ఇది వైసీపీ హయాంలో మొదలైంది. ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించాలని కోరుతూ తమ లెటర్హెడ్లపై అధికారులకు లేఖలు రాసే సంస్కృతిని ప్రారంభించారు. జీవీ ఎంసీ 88వ వార్డు పరిధి కోటనరవ వద్ద ఈడబ్ల్యూఎస్ లేఅవుట్ వెనుక ప్రైవేటు వ్యక్తులకు సుమారు 15 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమికి ఐదు అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. లేఅవుట్లో పార్కు నిమిత్తం కేటాయించిన స్థలంలో 180 గజాలు తీసుకుంటే ఐదు అడుగుల రోడ్డును 40 అడుగులకు విస్తరించుకోవచ్చునని, తద్వారా తమ భూముల విలువల పెంచుకోవచ్చునని భూముల యజమానులు భావించారు. దీనికోసం టీడీపీ నేత ద్వారా నాటి వైసీపీ ఎమ్మెల్యే ఒకరిని సంప్రతించారు. పార్కు స్థలాన్ని తమకు ఇస్తే, బదులుగా తమ భూమిలో అంతే స్థలాన్ని పార్కుకు కేటాయిస్తామంటూ ప్రతిపాదించారు. దీంతో సదరు ఎమ్మెల్యే పార్కు స్థలం మార్పిడికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తన లెటర్హెడ్పై జీవీఎంసీ అధికారులకు లేఖ రాసినట్టు తెలిసింది. దాని ఆధారంగా జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఆ పార్కు స్థలం మార్పిడికి నాటి మేయర్ గొలగాని హరివెంటకుమారి, కమిషనర్ సాయికాంత్వర్మ ద్వారా ముందస్తు ఆమోదం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో కూటమిలో ప్రజా ప్రతినిధిగా ఉన్న ఒకరు ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. అంతే...భూమార్పిడికి వీలుగా ఈ ఏడాది మే నెలలో మెమో అయ్యింది. అదేమాదిరిగా జీవీఎంసీ ఆరో వార్డు పరిధి మధురవాడ ఎంఎస్ఆర్ లేఅవుట్లోని బటర్ఫ్లై థీమ్ పార్క్ వెనుక ఉన్న రెండు ఎకరాల భూమికి రోడ్డు సదుపాయం లేదు. పార్కులోని కొంతస్థలం ఇస్తే ఆ భూమికి రోడ్డు సదుపాయం ఏర్పడుతుంది. వైసీపీ హయాంలో ఇద్దరు రియల్టర్లు అప్పటి ప్రజా ప్రతినిధి ద్వారా పార్కుస్థలం మార్పిడికి ప్రయత్నించారు. సదరు ప్రజా ప్రతినిధి ద్వారా జీవీఎంసీలో పావులు కదిపారు. రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన చేరింది. నిర్ణయం తీసుకునేలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాంతో కూటమికి చెందిన నాయ కుడిని ఆశ్రయించారు. పార్కు స్థలం మార్పిడికి సహకారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఒక మంత్రి పార్కుస్థలం మార్పిడికి వీలుగా చర్యలు తీసుకునేందుకు కమిటీని ఏర్పాటుచేయడం, ఆ కమిటీ అనుకూలంగా నివేదిక ఇవ్వడం...ప్రభుత్వం మెమో జారీచేయడం చకచకా జరిగిపోయాయి. అయితే బటర్ఫ్లై థీమ్ పార్క్ స్థల మార్పిడిపై హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో ధర్మాసనం స్టే విధించింది. కానీ, జీవీఎంసీ స్థలాలు అన్యాక్రాంతం కావడానికి నాయకులే కీలకంగా వ్యవహరించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Jul 13 , 2025 | 12:58 AM