అర్జీలపై క్షేత్రస్థాయిలో పర్యటన
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:44 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అందే అర్జీలపై అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు.
సమస్యలను స్వయంగా పరిశీలించి పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పీజీఆర్ఎస్లో 284 అర్జీలు స్వీకరణ
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అందే అర్జీలపై అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ంలో ఆమెతోపాటు జేసీ జాహ్నవి, డీఆర్ఓ సత్యనారాయణరావు ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, ఒకే సమస్యకు సంబంధించి కొంతమంది పదేపదే అర్జీలు ఇస్తున్నారని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఒకవేళ నిబంధనల ప్రకారం అర్జీని పరిష్కరించడం వీలుకానిపక్షంలో ఆ విషయాన్ని అర్జీదారులకు అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. అర్జీ స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్కు కాల్ చేస్తే.. వివరాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్లో వివిధ సమస్యలు, ఫిర్యాదులకు సంబంధించి 284 అర్జీలు అందాయని కలెక్టరేట్ విభాగం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ సుబ్బలక్ష్మి, సీపీవో జి.రామారావు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.హైమావతి, ఎక్సైజ్ శాఖ అధికారి వి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 11:44 PM