పర్యావరణ దినోత్సవ సందడి
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:59 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామాల్లో సైతం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జిల్లాలో 3 లక్షల 45 వేల మొక్కలు నాటిన యంత్రాంగం
డుంబ్రిగుడ మండలం అరకు పైనరీలో మొక్కలు నాటిన కలెక్టర్
పాడేరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని మండల, పంచాయతీ, గ్రామాల్లో సైతం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 45 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా డుంబ్రిగుడ మండలం అరకు పైనరీ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ పాడేరు ఐటీడీఏ ఆవరణలో, మండలంలో మోదాపల్లి పంచాయతీ గుర్రగరువు సమీపంలోనూ మొక్కలు నాటారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ అనంతగిరి మండలం చిలకలగెడ్డ అటవీ చెక్ పోస్టు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడేరు మండలం మినుములూరులో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వనం- మనం కార్యక్రమం, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు కట్టా సింహాచలం, అపూర్వభరత్, సబ్కలెక్టర్ కల్పశ్రీ, పాడేరు డివిజన్ పరిధిలో డీఎఫ్వో పీవీ.సందీప్రెడ్డి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, తదితరులు పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
Updated Date - Jun 05 , 2025 | 11:59 PM