ఈకేవైసీ టెన్షన్!
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:40 PM
రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఈనెల 30తో ముగియనుంది. ప్రతి రేషన్కార్డులోని లబ్ధిదారుడుతో ఈకేవైసీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఈ ప్రక్రియను పౌరసరఫరాల అధికారులు చేపడుతున్నారు.
నెలాఖరుతో ముగియనున్న రేషన్ కార్డుల బయోమెట్రిక్కు గడువు
జిల్లాలో 2,92,617 కార్డులు
8,69,142 మంది లబ్ధిదారులు
ఈకేవైసీ పూర్తయింది 7,95,064 మందికి
పెండింగ్ 63,909 మంది
ఐదేళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు మినహాయింపు
బయోమెట్రిక్ చేయించుకోకుంటే రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు ఈనెల 30తో ముగియనుంది. ప్రతి రేషన్కార్డులోని లబ్ధిదారుడుతో ఈకేవైసీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో ఈ ప్రక్రియను పౌరసరఫరాల అధికారులు చేపడుతున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 2 లక్షల 92 వేల 617 రేషన్ కార్డులుండగా, వాటిలో 8 లక్షల 69 వేల 142 మంది లబ్ధిదారులున్నారు. ఇప్పటివరకు 7 లక్షల 95 వేల 64 మందికి ఈకేవైసీ పూర్తిగా కాగా.. ఇంకా 63,909 మందికి చేయించాల్సి ఉంది. అలాగే ఐదేళ్లలోపున్న 9,733 మంది పిల్లలు, 80 ఏళ్లు పైబడిన 436 మంది వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికీ ఈకేవైసీ కాని వారు మాత్రం ఈనెల 30వ తేదీలోగా చేయించుకోవాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది. గడువు నాటికి శత శాతం ఈకేవైసీ చేయాలని పౌర సరఫరాలాధికారులు సూచిస్తున్నారు.
అసలైన లబ్ధిదారుల గుర్తింపునకే..
రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియతో అసలైన లబ్ధిదారులను పక్కాగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో అనర్హులకు సైతం రేషన్కార్డులు మంజూరు చేశారు. అలాగే కార్డులోని లబ్ధిదారులు మృతి చెందినా వారి పేర్లను తొలగించని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా కార్డుల్లో వారి పేరిట ప్రతి నెలా సరుకులు పొందుతున్నారు. బయోమెట్రిక్ నమోదు పూర్తయితే అసలైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందే అవకాశాలుంటాయని అధికారులు అంటున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకే అందించేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అంటున్నారు.
ఈకేవైసీని నిర్లక్ష్యం చేస్తే కార్డు రద్దు?
ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న రేషన్ కార్డుల ఈకేవైసీని లబ్ధిదారులు నిర్లక్ష్యం చేస్తే, వారి కార్డు రద్దయ్యే అవశాలున్నాయని అఽధికారులు అంటున్నారు. ఈకేవైసీ జరగని కారణంగా ఆ రేషన్కార్డు పనిచేయకుండా పోవడంతోపాటు తర్వాత రద్దు జాబితాలో చేరిపోతుంది. అందువల్ల రేషన్కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో రేషన్కార్డుల ఈకే వైసీ తాజా పరిస్థితి
- జిల్లాలో 22 మండలాల్లో మొత్తం రేషన్ డిపోలు 671
- రేషన్ కార్డుల సంఖ్య 2,92,617
- లబ్ధిదారులు 8,69,142 మంది
- ఇప్పటికి ఈకేవైసీ పూర్తయిన లబ్ధిదారులు 7,95,064 మంది
-పెండింగ్లో ఉన్న లబ్ధిదారులు 63,909 మంది
- 5 ఏళ్లు లోపు లబ్ధిదారులు 9733 మంది
- 80 ఏళ్లు పైబడిన వృద్ధ లబ్ధిదారులు 436
Updated Date - Jun 25 , 2025 | 10:40 PM