ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ అందరి బాధ్యత
ABN, Publish Date - Jul 19 , 2025 | 10:59 PM
ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ అందరి బాధ్యతని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ అన్నారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ
ఉత్సాహంగా ‘స్వచ్ఛాంరఽధ- స్వర్ణాంధ్ర ర్యాలీ
పాడేరు, జూలై 19(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ అందరి బాధ్యతని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్గౌడ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణానికి హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలన్నారు. వారపు సంతలు, పర్యాటక ప్రదేశాల్లో వాటర్ బాటిల్ వినియోగాన్ని నియంత్రించాలని, ప్లాస్టిక్ వినియోగంతో జల వనరుల కాలుష్యం పెరుగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్లాస్టిక్ నిషేధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట్ సాహిత్ మాట్లాడూతూ.. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని చేస్తుందన్నారు. భూమిలో ప్లాస్టిక్ 400 ఏళ్లు పాటు ఉంటుందన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’
స్థానిక కలెక్టరేట్లో శనివారం ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం కలెక్టరేట్లో మొక్కలు నాటారు. కలెక్టరేట్ ఉద్యోగులతో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఐటీడీఏ కార్యాలయంలో ఏపీవో ఎం.వెంకటేశ్వరావు, పరిపాలనాధికారి ఎం.హేమలత, ఐటీడీఏలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ‘స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Updated Date - Jul 19 , 2025 | 10:59 PM