శరవేగంగా సీతాకోక చిలుక ప్రాజెక్టు పనులు
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:12 PM
మండలంలో అటవీ శాఖ చేపడుతున్న సీతాకోక చిలుక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు సింహాద్రి ఎన్టీపీసీ రూ.5.5 కోట్లను అందించింది.
చురుగ్గా కాటేజీల నిర్మాణాలు
రూ.4.7 కోట్లతో డీపీఆర్ తయారు చేయించిన కూటమి ప్రభుత్వం
ప్రత్యేక ఆకర్షణగా మర్ధగుడ ఆర్చి
అనంతగిరి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో అటవీ శాఖ చేపడుతున్న సీతాకోక చిలుక ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు సింహాద్రి ఎన్టీపీసీ రూ.5.5 కోట్లను అందించింది. 2023వ సంవత్సరంలో ప్రారంభమైన పనులు నత్తనడక సాగాయి. రూ.80 లక్షలతో అరకు-విశాఖ ప్రధాన రహదారికి ఆనుకుని కాఫీహౌస్, రోడ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, గ్రావెటీ తాగునీటి పథకం, ట్యాంక్ నిర్మాణ పనులు జరిగాయి. తరువాత కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఏడాదిపాటు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టేట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా రూ.4.7 కోట్లకు డీపీఆర్ సిద్ధం చేయించి, పనులు వేగవంతం చేసింది. ప్రస్తుతం కాటేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ ద్వారం మర్ధగుడ ఎకో టూరిజం పేరుతో ఆర్చి నిర్మాణం పూర్తిచేశారు. అరకు- విశాఖ రోడ్డును ఆనుకుని ఆర్చి ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రాజెక్టు విశేషాలు
- రెస్టారెంట్, 16 కాటేజీలు, రిసెప్షన్, కిచెన్, ఫర్నిచర్, విద్యుత్ కనెక్షన్లు, తదితర పనులు
-ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని నిర్వహణతో పాటు స్థానిక గిరిజనుల అభివృద్ధికి, వన్యప్రాణుల పరిరక్షణకు వినియోగించనున్నారు.
- ఓపెన్ బటర్ఫ్లై గార్డెన్, ఔషధ మొక్కల వనం, వాచ్ టవర్ నిర్మించనున్నారు.
-జీవ వైవిధ్యం గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక స్టడీ సెంటర్
-సేంద్రియ పద్ధతిలో స్వచ్ఛమైన అటవీ ఉత్పత్తులను అందించేందుకు అటవీ శాఖ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేయనుంది. ఇందులోని చింతపండు, పనస, ఏజెన్సీలోని పండే అరుదైన పండ్లు అందుబాటులో ఉంటాయి.
-మర్ధగుడ వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్)లో 80 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రాజెక్టును అనుసంధానం చేస్తూ ఉపాధి కల్పించనున్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:12 PM