మన్యంలో బార్బడోస్ చెర్రీ
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:18 AM
ఉద్యాన పరిశోధన స్థానంలో బార్బడోస్ చెర్రీ చెట్లు విరగ్గాశాయి. అరుదైన చెర్రీ కావడంతో ఈ పండ్లను రుచి చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో సుమారు పదేళ్ల క్రితం మొక్కలు వేయగా.. ఇప్పుడు చెట్లుగా ఎదిగాయి.
ఉద్యాన పరిశోధన స్థానంలో విరగ్గాసిన చెట్లు
పండ్ల రుచి చూసేందుకు స్థానికులు ఆసక్తి
గిరిజన ప్రాంతంలో సాగుకు అనుకూలం
చింతపల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన పరిశోధన స్థానంలో బార్బడోస్ చెర్రీ చెట్లు విరగ్గాశాయి. అరుదైన చెర్రీ కావడంతో ఈ పండ్లను రుచి చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో సుమారు పదేళ్ల క్రితం మొక్కలు వేయగా.. ఇప్పుడు చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో పండ్ల దిగుబడి వస్తున్నది. ఆకర్షణీయంగా చిన్నపాటి యాపిల్స్ మాదిరిగా ఉండే ఈ పండ్లు చూసే వాకి నోరూరిస్తున్నాయి. ఈ పండ్లు పులుపు, తీపి కలగలిపిన రుచి ఉండడంతో తినేందుకు స్థానికులు, సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
బార్బడోస్ చెర్రీలను వెస్ట్ ఇండియా చెర్రీ, అనిరోలా అని పిలుస్తారు. అరుదుగా లభించే బార్బడోస్ చెర్రీ మొక్కలు గిరిజన ప్రాంతంలో బాగా పెరుగుతున్నాయి, పండ్ల దిగుబడి అధికంగా ఉంటుంది. ఈ మొక్కలను పరిశోధన స్థానంలో 12ఏళ్లగా సాగు చేస్తున్నారు. ఈ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా వుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బార్బడోస్ చెర్రీలకు ఉత్తర భారత దేశంలో, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నంలో మార్కెట్లో కిలో రూ.240కి విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో మార్కెటింగ్ సదుపాయం పెద్దగా లేకపోయినప్పటికి కుటుంబ సభ్యులు తినడానికి పెరటిలో రెండు, మూడు మొక్కలు పెంచుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా జూన్ నుంచి ఆగస్టు వరకు పండ్ల దిగుబడి వస్తుంది.
సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలం
చెట్టి బిందు, అధిపతి, ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి
గిరిజన ప్రాంతం బార్బడోస్ చెర్రీ సాగుకి అత్యంత అనుకూలం. పరిశోధన స్థానంలో సాగు చేస్తున్న బార్బడోస్ చెర్రీ మొక్కలు విరగ్గాస్తున్నాయి. మొక్కలు నాటిన నాలుగో ఏడాది నుంచి కాపుకొస్తాయి. గరిష్ఠంగా 30 సంవత్సరాల వరకు పండ్ల దిగుబడి వస్తుంది. గిరిజన ప్రాంతంలో అరుదైన స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, ఆవకడో పంటలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. సీజన్లో ఈ పండ్లను కొనుగోలు చేసుకునేందుకు మైదాన ప్రాంతాల నుంచి వర్తకులు వస్తున్నారు. బార్బడోస్ చెర్రీ సాగు రైతులు చేపడితే మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మైదాన ప్రాంతాల సూపర్బజార్లకు సైతం ఎగుమతి చేసుకుని అధిక ధర పొందవచ్చు.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
బి.దివ్య సుధ, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి
బార్బడోస్ చెర్రీలు మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి అధికంగా లభిస్తుంది. పలు రకాల ఖనిజాలు వుంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మంచి ప్రయోజకరంగా ఉంటుంది. గర్భిణుల్లో శిశువు ఎదుగుదలకు దోహపడుతుంది. ఏడాదికి ఒకసారి అయినా ఈ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది.
Updated Date - Jun 14 , 2025 | 01:18 AM