గిరి ప్రదక్షిణకు పక్కాగా ఏర్పాట్లు
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:55 AM
ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే సింహగిరి ప్రదక్షిణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సింహాచలం దేవస్థానం అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు.
భక్తులు నడిచే 32 కి.మీ. మేర సీసీ టీవీ కెమెరాలు, వైద్య శిబిరాలు
హనుమంతవాక, ఇసుకతోట జంక్షన్లలో తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
9, 10 తేదీలలో మద్యం షాపుల మూసివేత
సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, జూల్ 1 (ఆంధ్రజ్యోతి):
ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే సింహగిరి ప్రదక్షిణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సింహాచలం దేవస్థానం అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, దేవస్థానం ఈఓ త్రినాథరావు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన మంగళవారం గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడెక్కడ ఏమేమి...అవసరమో సూచించారు. కలెక్టరేట్లో సాయంత్రం ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తొమ్మిదో తేదీ తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఎవరికైనా అనారోగ్యం కలిగితే చికిత్స కోసం కిలోమీటరుకు ఒక శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. వాటిలో డాక్టర్, ఏఎన్ఎం, ఆశ వర్కర్ మందులతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రదక్షిణ ప్రాంతాల్లో విద్యుద్దీపాలన్నీ వెలగాలని, జీవీఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. హనుమంతవాక, ఇసుకతోట జంక్షన్లలో భక్తులు రోడ్డు దాటాల్సి ఉన్నందున ఆ రెండు ప్రాంతాల్లో తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఆ రెండు రోజుల్లో మద్యం దుకాణాలను మూసివేయించాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. సింహాచలం కొండపై ముందుజాగ్రత్త చర్యగా అగ్నిమాపక దళం, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలన్నారు. అలసిన భక్తులు విశాంత్రి తీసుకోవడానికి హోల్డింగ్ పాయింట్లను పెట్టాలన్నారు. దారిపొడవునా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర సేవల కోసం ‘అస్త్రం’ యాప్ ఉపయోగించుకోవాలని విస్తృత ప్రచారం చేస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతులు ఇవ్వాలని, వారి కౌంటర్లు ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్, జీవీఎంసీ, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:55 AM