బాణసంచా కేంద్రం పేలుడులో మరొకరి మృతి
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:09 AM
మండలంలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిలో మరో వ్యక్తి మృతిచెందాడు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కోటవురట్ల పంచాయతీ శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన జల్లూరు నాగరాజు(57) గురువారం ఉదయం చనిపోయాడు.
తొమ్మిదికి చేరిన మరణాలు
కోటవురట్ల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిలో మరో వ్యక్తి మృతిచెందాడు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కోటవురట్ల పంచాయతీ శివారు రాట్నాలపాలెం గ్రామానికి చెందిన జల్లూరు నాగరాజు(57) గురువారం ఉదయం చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. బాణసంచా తయారీ కేంద్రంలో ఈ నెల 13వ తేదీన జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడడంతో విశాఖ కేజీహెచ్కు తరలించిన విషయం తెలిసిందే. నాగరాజు మృతదేహాన్ని సాయంత్రం గ్రామానికి తీసుకువచ్చారు. దీంతో రాట్నాలపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇతనికి భార్య అప్పలనర్స, కుమారుడు అయ్యన్న, కుమార్తె మౌనిక వున్నారు. కుమారుడు అగ్రికల్చర్ డిప్లొమా, కుమార్తె నర్సింగ్ కోర్సులు చేశారు. నాగరాజు రెండేళ్ల నుంచి బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. భార్య కూలి పనులకు వెళుతుంది. వచ్చే అరకొర సంపాదనతోనే ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:09 AM