కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన తల్లి
ABN, Publish Date - Apr 10 , 2025 | 12:31 AM
గుండెపోటుతో కుమారుడు మృతిచెందాడని తెలిసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా షాక్కు గురై ప్రాణాలను విడిచింది.
ఆగిన గుండె...ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు
పాడేరు మండలం లగిశపల్లిలో విషాదం
పాడేరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గుండెపోటుతో కుమారుడు మృతిచెందాడని తెలిసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా షాక్కు గురై ప్రాణాలను విడిచింది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిశపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. లగిశపల్లి గ్రామానికి చెందిన లకే సింహాచలంపాత్రుడు (48) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టిన ఆయన తల్లి సోములమ్మకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని కుటుంబ సభ్యులు వెంటనే చెప్పలేదు. ఆమె కుమారుడి ఇంటికి సమీపంలోని కుమ్మరిపుట్టులో కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండడంతో కుటుంబీకులు, బంధువులు ఉదయం ఈ వార్త ఆమెకు చెప్పారు. కుమారుడి మరణ వార్తను తట్టుకోలేక సోములమ్మ ప్రాణాలను విడిచింది. దీంతో ఒకేసారి తల్లీ,కొడుకు అంత్యక్రియలను లగిశపల్లిలో నిర్వహించారు. ఈ ఉదంతంతో లగిశపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Updated Date - Apr 10 , 2025 | 12:31 AM