369 కిలోల గంజాయి పట్టివేత
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:01 AM
స్థానిక పోలీసులు మంగళవారం 369 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేశారు. ఒక వాహనం డ్రైవర్ను అరెస్టు చేయగా, మరో డ్రైవర్ పారిపోయాడు. ఇందుకు సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఒకరి అరెస్టు, మరొకరు పరారీ
నక్కపల్లి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీసులు మంగళవారం 369 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేశారు. ఒక వాహనం డ్రైవర్ను అరెస్టు చేయగా, మరో డ్రైవర్ పారిపోయాడు. ఇందుకు సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఒడిశా నుంచి అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల మీదుగా మంగళవారం రెండు కార్లలో గంజాయి రవాణా చేస్తున్నట్టు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందింది. సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, పోలీసు సిబ్బంది వేంపాడు టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కొద్దిసేపటి తరువాత నక్కపల్లి వైపు నుంచి తుని వైపు వెళ్లాల్సిన రెండు కార్లు, టోల్ ప్లాజా వద్ద పోలీసులను గమనించి వెంటనే ‘యూ’ టర్న్ తీసుకుని నక్కపల్లి వైపు వేగంగా వెళ్లడం మొదలుపెట్టారు. సీఐ, ఎస్ఐలు వాహనాల్లో వారిని వెంబడించారు. దీంతో ఒక కారు డ్రైవర్ వెదుళ్లపాలెం వద్ద నక్కపల్లి వెళుతున్న దేవవరం గ్రామానికి చెందిన వైబోయిన శ్రీనివాసరావును వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో అతను గాయపడ్డాడు. కాగా డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పక్కన వున్న జీడిమామిడి తోటలో నుంచి పారిపోయాడు. మరో కారు డ్రైవర్ కూడా ఇదే విధంగా పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కార్లలో వున్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. తూకం వేసి 369 కిలోల గంజాయి వున్నట్టు నిర్ధారించారు. కార్లను సీజ్ చేసి, ఉత్తరప్రదేశ్కు చెందిన కారు డ్రైవర్ నరేంద్రను అరెస్టు చేశారు. కాగా వెదుళ్లపాలెం వద్ద గాయపడిన శ్రీనివాసరావుకు నక్కపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంత రం కుటుంబ సభ్యులు తునిలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు సీఐ చెప్పారు.
Updated Date - Jun 25 , 2025 | 12:01 AM