రెండు రోజుల్లో 32 శాతం రేషన్ పంపిణీ
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:14 AM
జిల్లాలోని రేషన్ డిపోల్లో రెండు రోజుల్లోనే 32 శాతం కార్డులకు సరుకులు పంపిణీ చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
కలెక్టర్ విజయకృష్ణన్
దివ్యాంగులు, వయోవృద్ధులకు ఐదో తేదీలోగా ఇళ్లవద్దకే సరుకులు
అనకాపల్లి టౌన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని రేషన్ డిపోల్లో రెండు రోజుల్లోనే 32 శాతం కార్డులకు సరుకులు పంపిణీ చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం ఉదయం జీవీఎంసీ 84వ వార్డు కోట్నివీధి 15వ నంబరు రేషన్ షాపు పరిధిలో సరుకుల పంపిణీపై ఆమె ఆరా తీశారు. రేషన్ షాపులో తనిఖీలు నిర్వహించిన కలెక్టర్.. తూకంలో తేడాలు లేకుండా రేషన్ పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ గురించి తెలుసుకున్నారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులైన విరోతి నాగయ్యమ్మ, కోట నాగమ్మ, చిత్త చంద్రమ్మ, బొడ్డు మంగవేణిల ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేశారు. రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీపై స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో 1069 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఐదు లక్షల 30 వేల కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తామనిఇ చెప్పారు. ఒకటి, రెండు తేదీల్లో 32 శాతం కార్డులకు రేషన్ పంపిణీ పూర్తయ్యిందని చెప్పారు. జిల్లాలో దివ్యాంగులు, ఇంటి నుంచి కదలలేని స్థితిలో ఉన్న వారు, 65 సంవత్సరాలు దాటిన వారు సుమారు 66 వేల మంది ఉన్నారని, ఐదో తేదీలోగా ఆయా రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు రేషన్ డీలర్లు వీరి ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో షేక్ ఆయీషా, జిల్లా సరఫరాల అధికారి కేఎల్ఎన్ మూర్తి, తహసీల్దార్ బి.విజయ్కుమార్, తదితరులు వున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 01:14 AM