ఒక పోస్టుకు 26 మంది..
ABN, Publish Date - May 18 , 2025 | 12:30 AM
మెగా డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులకు 29,779 మంది 49,658 దరఖాస్తు చేశారు.
డీఎస్సీకి తీవ్ర పోటీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 1,139 ఉపాధ్యాయ ఖాళీలు
29,779 మంది అభ్యర్థులు.. 49,658 దరఖాస్తులు
పురుషుల కంటే 6,233 మంది మహిళా అభ్యర్థులే అధికం
అత్యధికంగా ఎస్టీ కేటగిరీలో 10,523 మంది దరఖాస్తు
బీసీ-డీలో 8,330 మంది..
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):
మెగా డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులకు 29,779 మంది 49,658 దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 26 మంది పోటీపడుతున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో 734 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో 400 ఎస్జీటీ పోస్టులు, జువెనైల్ పాఠశాలలో ఐదు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 29,779 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎక్కువ మంది రెండు అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మొత్తం 49,658 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పురుషులు 11,773 మంది, మహిళలు 18,006 మంది ఉన్నారు. పురుషుల కంటే 6,233 మంది మహిళా అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. రిజర్వేషన్ కేటగిరీలవారీగా పరిశీలిస్తే ఎస్టీ నుంచి అత్యధికంగా 10,523 మంది దరఖాస్తు చేశారు. ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో 400 ఎస్జీటీ పోస్టులు ఉండడంతో గిరిజన ప్రాంతాల నుంచి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తం అభ్యర్థుల్లో మూడింట ఒక వంతు ఈ కేటగిరీకి చెందినవారు కావడం విశేషం. ఆ తరువాత వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఐదు కేటగిరీలకు కలిపి 13,454 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. వీరిలో అత్యధికంగా బీసీ-డీ నుంచి 8,330, తరువాత బీసీ-బీ నుంచి 2,563 మంది, బీసీ-ఏ నుంచి 1,940, బీసీ-ఈ నుంచి 423, బీసీ-సీ నుంచి 198 మంది ఉన్నారు. ఓపెన్ కేటగిరీ నుంచి 1,626 మంది దరఖాస్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు తరువాత విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్సీ కేటగిరీ-1 నుంచి 479 మంది, కేటగిరీ-2 నుంచి 876 మంది, కేటగిరీ-3 నుంచి 2,821 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దివ్యాంగుల కోటాలో అన్ని కేటగిరీలు కలిపి 890 దరఖాస్తులు వచ్చాయి.
Updated Date - May 18 , 2025 | 12:30 AM