‘తుంగ’లో తొక్కేశారు..!
ABN, Publish Date - May 20 , 2025 | 12:04 AM
వైసీపీ పాలనలో పేదల సొంతింటి కల.. కలగానే మిగిలింది.
పేదలకు అందాల్సిన ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు
మంత్రాలయంలో తుంగభద్ర నదిపై తెలుగుతమ్ముళ్ల కన్ను
ఆదోని సబ్ కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
వైసీపీ పాలనలో పేదల సొంతింటి కల.. కలగానే మిగిలింది. ఇసుక ధర అధికంగా ఉండడంతో చాలా మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. అయితే ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో పేదలకు ఉచితంగా ఇసుకను అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని తెలుగుతమ్ముళ్లు తుంగలో తొక్కేశారు. మంత్రాలయంలోని తుంగభద్ర నది నుంచి ఇసుకను రాత్రికి రాత్రే అక్రంగా తోడేసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇసుకను ఇలా అక్రమంగా తరలిస్తే పేదలకు ఎక్కడ దొరుకుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు.
మంత్రాలయం, మే 19 (ఆంధ్రజ్యోతి): పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు తుంగభద్రలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలన్న సద్దుద్దేశంతో ముందుకెళ్తుండగా.. ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులే ఉచిత ఇసుక పేరుతో లాడ్జీలు, హోటళ్లు, పెద్ద పెద్ద భవంతులకు ఇసుకను రవాణా చేస్తున్నారు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వయంగా నదిలోకి వెళ్లి అక్రమ ఇసుక తోడుతున్న ప్రదేశాన్ని పరిశీలించి అక్కడే రెవెన్యూ, పోలీసులకు ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ ఆదేశాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.. కొంత మంది తెలుగుతమ్ముళ్లు ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తమ మాట వినకుంటే నాయకుల నుంచి ఫోన్లు చేయించి ఇసుక దందాకు తెరలేపారు. చీకటి పడితే చాలు మంత్రాలయం పుణ్యక్షేత్రంలో సుంకప్ప తాత దర్గా వద్ద, రాగసుధ, ఎనఏపీ ఘాట్, చెట్నపల్లి వద్ద పాత చాపల చెరువు, మాధవరం బ్రిడ్జి వద్ద ఇసుకను తుంగభద్రలో ఇసుకను తోడేస్తున్నారు. రోజుకు 30 ట్రాక్టర్లకు పైగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా, రెవెన్యూ, పంచాయతీ పోలీసులు అడిగే వారేలేరు. వర్షం వచ్చి మళ్లీ తుంగభద్ర నదికి వరద వస్తే ఇసుకకు డిమాండ్ ఉంటుందనే ముందు జాగ్రత్తగా తెలుగు తమ్ముళ్లు నది ఒడ్డున స్టాక్ పాయింట్తో డంప్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముతూ రోజుకు పదుల సంఖ్యలో విక్రయిస్తూ రూ.లక్షల్లో ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా సంపాదిస్తున్నారు. పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం పలువురు మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు కాపలాగా పెట్టిన వీఆర్ఏలకు అక్రమార్కులు ట్రాక్టరుకు రూ.1000 మూమూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలోకి వెళ్లాలంటే రైతుల పొలాలను దాటుకొని వెళ్లాలి. ఈ పొలాల్లో వెల్లడానికి అక్రమార్కులు దారి ఇచ్చిన ఒక్కో రైతుకు నెలకు రూ.10 వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. పొలం దెబ్బతింటుందని రైతు ఒప్పుకోకపోతే టీడీపీ నాయకుల నుంచి ఫోనల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్రమ ఇసుకకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రామ అధికార పార్టీ నాయకులే అక్రమ ఇసుకకు తెర లేపడంతో మంత్రాలయం, చెట్నహల్లి, మాధవరంలో ఇసుక డంప్లు భారీగా దర్శనం ఇస్తున్నాయి. మంత్రాలయం ట్రాక్టర్లు 6, చిలకలడోన 6, కల్లుదేవకుంట 2, సూగూరు 4, మాధవరం 5, చెట్నహల్లి 8 ట్రాక్టర్లు నిత్యం అక్రమ ఇసుకను తోడేస్తున్నారు. మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరుకు ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.4వేల నుంచి రూ.5 వేలకు తరలిస్తున్నారు.
ఫ రాత్రి సమయంలో గస్తీ పెంచాం - ఎస్.రవి, తహసీల్దార్, మంత్రాలయం:
మంత్రాలయం నుంచి అక్రమంగా రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలు, వీఆర్ఏలతో రాత్రి పూట గస్తీ పెంచాం. ఇసుక కోసం నదిలో వెళ్లే దారిలో గోతులు తీసి ట్రాక్టర్లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం. లాడ్జీలు, హోటళ్లు, పెద్ద పెద్ద భవంతులకు ఇసుక అక్రమంగా తరలిస్తే సీజ్ చేస్తాం. ఇసుక డంప్లు త్వరలో గుర్తించి సీజ్ చేస్తాం.
అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తాం
- రామాంజులు, సీఐ మంత్రాలయం
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తాం. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు నడుచుకోవాలి. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలకు మంత్రాలయం నది నుంచి ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి తహసీల్దార్కు అప్పగిస్తాం.
Updated Date - May 20 , 2025 | 12:04 AM