Nandyal Politics: ఆత్మకూరులో రోడ్డెక్కిన తమ్ముళ్లు
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:05 AM
స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లేకుండా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనకు సిద్ధమవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలోని ఒక వర్గం ఆమె వాహనాన్ని అడ్డుకుంది. మరో టీడీపీ నేత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పై రాళ్లు విసిరింది.
ఎంపీ శబరిని అడ్డుకున్న బుడ్డా వర్గం
ఎమ్మెల్యే లేకుండా పర్యటన చేయడంపై ఆగ్రహం
శబరి కారు అడ్డగింత.. ఏరాసుపై రాళ్లదాడి
‘సుపరిపాలనలో తొలి అడుగు’లో ఘటన
నంద్యాల, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లేకుండా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనకు సిద్ధమవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలోని ఒక వర్గం ఆమె వాహనాన్ని అడ్డుకుంది. మరో టీడీపీ నేత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పై రాళ్లు విసిరింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం సాక్షిగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర ప్రభు త్వం తలపెట్టిన దివ్యాంగుల పరికరాల పంపిణీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కోసం ఎంపీ బైరెడ్డి శబరి ఉద యం తొమ్మిది గంటలకు ఆత్మకూరుకు చేరుకున్నారు. అల్పాహారం నిమిత్తం పిలవగా, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటికి వెళ్లారు. షెడ్యూల్ కార్యక్రమానికి మరో గంట సమయం ఉండటంతో అక్కడినుంచి బయటకు వచ్చి స్థానిక వార్డులో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని చేపట్టేందుకు యత్నించారు. ఇంతలో.. అక్కడకు దాదాపు 70 మంది టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఎమ్మెల్యే బుడ్డా వెంట లేకుండా ఎలా పర్యటన చేస్తారంటూ ఎంపీ శబరిని వారు అడ్డుకున్నారు. ఆమె వెంట ఉన్న అనుచరగణం వారిని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పక్కనే ఇంటి ఆవరణలో ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డిపై బుడ్డా వర్గం రాళ్ల దాడి చేసింది. ఈ దాడిలో ఏరాసు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ఇంటి అద్దా లు ధ్వంసమయ్యాయి. ఇలా మూడు గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇద్దరి కీ సర్దిచెప్పారు. అయితే, తాను దివ్యాంగుల కార్యక్రమంతోపాటు సుపరిపాలనలో తొలి అడుగు .కార్యక్ర మం కోసం ఆత్మకూరుకు వస్తున్నట్టు ఎమ్మెల్యే బుడ్డా కు శబరి ముందే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారని, తాను కూడా వస్తానని చెప్పారని సమాచారం. అయితే ఏం జరిగిందో ఏమోగానీ ఎమ్మెల్యే రాలేదు. కాగా, ఆత్మకూరు ఘటన విషయం ఎంపీ శబరి, ఏరాసు ప్రతాపరెడ్డి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
Updated Date - Jul 05 , 2025 | 04:07 AM