Kadambari Jetwani Case: జెత్వానీ కేసులో పిఎస్ఆర్ కు బెయిల్
ABN, Publish Date - May 31 , 2025 | 05:13 AM
సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులకు కాదంబరి జెత్వానీ కేసులో హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు దర్యాప్తు పూర్తి అవ్వేవరకు ఆయన పాస్పోర్ట్ సర్డర్ చేయాలని, మీడియా వద్ద వ్యాఖ్యలు చేయరాదు అని ఆదేశించింది.
పలు షరతులతో మంజూరు చేసిన హైకోర్టు
కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు
కోర్టులో పాస్పోర్టు సరెండర్ చేయాలి
కేసు విషయంలో ఎవర్నీ బెదిరించకూడదు
తీర్పు ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టీకరణ
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు(ఏ2)కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు సంతృప్తి మేరకు రూ. 20 వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, విజయవాడ కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. ఆ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసేవరకు ప్రతినెల రెండో శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని పేర్కొంది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, కోరినప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని తేల్చిచెప్పింది. కేసు విషయంలో ఎవర్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేయడానికి, బెదిరించడానికి వీల్లేదని పేర్కొంది. కేసు గురించి మీడియా వద్ద మాట్లాడవద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పింది. ఇదే తరహా నేరాలకు పాల్పడడానికి వీల్లేదంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇవ్వగా, తీర్పు ప్రతి శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. జెత్వానీ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 22న పీఎ్సఆర్ ఆంజనేయులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు ప్రతిలో న్యాయమూర్తి ఏమన్నారంటే.. ‘‘పిటిషనర్ సస్పెన్షన్లో ఉన్నారు. కేసులో ఇతర నిందితులకు కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ.. ఈ కేసు తప్పుడు కేసా? కాదా? అని తేల్చే వ్యవహారం సంబంధిత కాంపిటెంట్ కోర్టు పరిధిలోనిదని చెప్పింది. పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయడం సీఆర్పీసీ సెక్షన్ 195 ప్రకారం నిషేధం ఉందని అందులో పేర్కొంది. ఇక పిటిషనర్ పోలీస్ కస్టడీ ముగిసింది. సుమారు 50 మందికిపైగా సాక్షులను విచారించారు. దర్యాప్తు పురోగతి, సెక్షన్ 195 తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
Updated Date - May 31 , 2025 | 05:13 AM