crime news: ఫేమస్ అవ్వడానికే.. చర్చి గోడలపై రాతలు
ABN, Publish Date - Apr 02 , 2025 | 11:57 PM
Church walls.. Seeking fame ‘మతవిద్వేషాల ప్రేరేపిత గొడవల నేపఽథ్యంలో తాము కూడా ఫేమస్ అవుదామనే కోణంలో ఇద్దరు యువకులు చర్చి గోడలపై రాశారు. వారిద్దరినీ అరెస్ట్ చేశామ’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినచర్యలు
జలుమూరు ఘటనపై 9 బృందాల దర్యాప్తు
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘మతవిద్వేషాల ప్రేరేపిత గొడవల నేపఽథ్యంలో తాము కూడా ఫేమస్ అవుదామనే కోణంలో ఇద్దరు యువకులు చర్చి గోడలపై రాశారు. వారిద్దరినీ అరెస్ట్ చేశామ’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని చిన్నబజార్ వీధిలో ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చి, వన్టౌన్ పరిధి టౌన్హాల్ రోడ్లో ఉన్న ఆర్సీఎం సెయింట్ ఽథామస్ చర్చి గోడలపై మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి జై శ్రీరామ్ అని రాశారు. ఈ విషయం తెలుసుకున్న రెండవ పట్టణ పోలీసుస్టేషన్ సీఐ పి.ఈశ్వరరావు, శ్రీకాకుళం సీఐ పైడపునాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మతవిద్వేషాలు, అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా వివరాలు సేకరించారు. అనంతరం రెండు చర్చిల గోడలపై రాతలను తొలగించారు. చర్చి పాస్టర్ల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన సీఐలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్చిలో సీసీ కెమెరాలు పని చేయలేదు. దీంతో రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ద్విచక్ర వాహనాన్ని సీఐలు గుర్తించారు. శ్రీకాకుళం నగరం గూనపాలెం మేదరవీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్ అలియాస్ ప్రసాద్, గ్రంధి సోమశేఖర్ ఈ ఘటనకు పాల్పడినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. వారిద్దరూ మద్యం సేవించి.. ఎర్రరంగు డబ్బాను చర్చిల వద్దకు తీసుకెళ్లారు. ఎలక్ర్టికల్ పనులు చేసే సోమశేఖర్.. చర్చిల్లో విద్యుత్ వైర్లు కట్ చేసి.. గోడలపై రాతలు రాసి.. ద్విచక్ర వాహనంపై పరారయ్యారైనట్టు గుర్తించారు. వారిద్దరూ బుధవారం అరసవల్లి మామిడితోట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆ రాతలు రాసినట్టు అంగీకరించారు. జలుమూరులో ఆలయాలపై రాతలు, ఫాస్టర్ ప్రవీణ్ మరణం లాంటి విషయాలను సోషల్ మీడియాలో చూసి తాము కూడా అలానే చేసి ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో ఈ పని చేసినట్టు అంగీకరించార’ని ఎస్పీ వివరించారు.
కఠినచర్యలు తప్పవు
దేవాలయాలు, చర్చిలు, ప్రజలు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే.. కఠినచర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ‘కుల,మత,రాజకీయ వర్గాల మధ్య మత విద్వేషాలు రగిల్చేలా, శాంతిభధ్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు నమోదు చేసి కఠిన శిక్ష అమలు చేస్తాం. జిల్లాలోని ఆలయాలు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు, యూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి. సెక్యూరిటీగార్డులను నియమించుకోవాలి. హుండీలకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలి. జలుమూరు ఘటన కానీ,శ్రీకాకుళంలో చర్చి గోడలపై రాతల విషయంలో గానీ ఎక్కడా సీసీ కెమెరాలు పని చేయలేదు. ఇప్పటికే ఆలయాల, చర్చి కమిటీ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి కెమెరాలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. జలుమూరు ఘటనపై 9 బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికే 42 సీసీ కెమెరాలు పరిశీలించాం. 665 ద్విచక్రవాహనాలను గుర్తించి అందరినీ విచారణ చేశాం. 190 మంది అనుమానితులను ప్రశ్నించాం. నిందితులు స్ర్పే వాడటంతో కెమికల్ సంబంధిత షాపుల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. నేరాలు అరికట్టేందుకు మీడియా, ప్రజలు సహకరించాల’ని ఎస్పీ కోరారు. శ్రీకాకుళంలో ఒక్కరోజులో కేసును ఛేదించిన డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ కె.పైడపునాయుడు, టూటౌన్ సీఐ పి.ఈశ్వరరావు, హోంగార్డు నరేష్, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సీసీ కెమెరాలు పనిచేయనప్పటికీ నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, ఎస్బీ సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు, వన్టౌన్ ఎస్ఐ ఎం.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 02 , 2025 | 11:57 PM