Turtles: ‘కూర్మా’నికి కష్టకాలం
ABN, Publish Date - May 11 , 2025 | 11:33 PM
Srikurmam Turtles Wildlife Health గార మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో తాబేళ్లకు కష్టకాలం ఎదురవుతోంది. ఈ క్షేత్రంలోని పార్కులో ఉన్న తాబేళ్లు కొన్ని ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంద తాబేళ్లకు ప్రత్యేక వైద్యం అందించి.. వాటిని పరిరక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
శ్రీకూర్మంలో అనారోగ్యానికి గురవుతున్న తాబేళ్లు
వైజాగ్ జూకి వంద తరలింపు
పార్కులో మిగిలిన వాటికి సంరక్షణ చర్యలు
గార, మే 11(ఆంధ్రజ్యోతి): గార మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో తాబేళ్లకు కష్టకాలం ఎదురవుతోంది. ఈ క్షేత్రంలోని పార్కులో ఉన్న తాబేళ్లు కొన్ని ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంద తాబేళ్లకు ప్రత్యేక వైద్యం అందించి.. వాటిని పరిరక్షించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఇక్కడ కొన్ని తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ఎమ్మెల్యే గొండు శంకర్, అటవీ శాఖ, పశువైద్య శాఖ అధికారులు ఆ తాబేళ్లను పరిశీలించారు. ఈ నెల 4న ఇక్కడ పార్కులో ఆరోగ్యం సరిగా లేని వంద తాబేళ్లను గుర్తించారు. వాటికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైజాగ్ జూలో యానిమల్ రెస్క్యూ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ వాటికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కువ తాబేళ్లకు నోటి నుంచి నురగ వస్తుండడంతో అవి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్టు అటవీ శాఖ, పశువైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్కులో ఉన్న 211 తాబేళ్లను రోజూ ఆలయ అధికారులు పర్యవేక్షిస్తూ సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
విశాలమైన స్థలం అవసరం
శ్రీకూర్మంలో పదేళ్ల కిందట తాబేళ్ల పార్కు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉన్న కొద్దిపాటి తాబేళ్లకుగానూ చిన్నపార్కు ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం వాటి సంఖ్య పెరగడంతో ఇరుకుగా మారుతోంది. విశాలమైన స్థలం లేకపోవడంతో తాబేళ్లు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయి. విశాలమైన స్థలంలో తాబేళ్ల పార్కును ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వైద్య సేవలు అందిస్తున్నారు
ఆరోగ్యం బాగోలేని వంద తాబేళ్లను పశువైద్య శాఖాధికారులు పరిశీలించిన తర్వాత వైజాగ్లో జూ పార్కుకి తీసుకెళ్లాం. అక్కడ యానిమల్ రెస్క్కూ సెంటర్లో ప్రత్యేక వైద్యులు పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. శ్రీకూర్మంలో తాబేళ్ల సంరక్షణకు విశాలమైన స్థలం అవసరం ఉంది. దీనికోసం ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేయాలి.
- ఎ.వెంకటేష్, జిల్లా అటవీశాఖ అధికారి
సంరక్షిస్తున్నాం
అటవీ శాఖ, పశువైద్య శాఖాధికారులు పరిశీలించి.. వంద తాబేళ్లను జూ పార్కుకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 212 తాబేళ్లను సంరక్షిస్తున్నాం.
-కె.నరసింహనాయుడు, ఈవో, శ్రీకూర్మం
Updated Date - May 11 , 2025 | 11:33 PM